విజయశాంతికి పోటీగా జయసుధ: పార్టీలో ఎంట్రీ ఖాయం: కండీషన్స్ అప్లై..!!
హైదరాబాద్: తెలంగాణలో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న ప్రస్తుత పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. ఆపరేషన్ ఆకర్షకు తెర తీసింది. చేరికల కోసం ప్రత్యేకంగా ఓ కమిటీని సైతం ఏర్పాటు చేసింది బీజేపీ హైకమాండ్. ఇతర పార్టీల నుంచి చేరికలకు గేట్లు ఎత్తేసింది. అధికార తెలంగాణ రాష్ట్ర సమితి, కాంగ్రెస్ పార్టీల్లో అసంతృప్తులను టార్గెట్గా చేసుకుంది. ఇందులో కొంతవరకు విజయం సాధించింది కూడా.
Recommended Video


ఇప్పటికే దాసోజు జాయిన్
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ ఇప్పటికే కాషాయకండువాను కప్పుకొన్నారు. పార్టీ ఇన్ఛార్జ్ తరుణ్ ఛుగ్ సమక్షంలో బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సోదరుడు ప్రదీప్ రావు టీఆర్ఎస్కు గుడ్బై చెప్పారు. రెండు రోజుల కిందటే ఆయన పార్టీ, ప్రాథమిక సభ్యత్వానికీ రాజీనామా చేశారు. ప్రదీప్ రావు బీజేపీలో చేరబోతోన్నారనే ప్రచారం ఉంది. దీనికోసం ఆయన ముహూర్తాన్ని చూసుకుంటోన్నారని చెబుతున్నారు.

21న కోమటిరెడ్డి..
కాంగ్రెస్ పార్టీకి చెందిన బిగ్ షాట్, నల్లగొండ జిల్లా మునుగోడు శాసన సభ్యుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా కాంగ్రెస్ నుంచి బయటికి వచ్చారు. తన పదవికీ రాజానామా చేశారు. సోమవారమే ఆయన స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డిని కలిసి తన రాజీనామా పత్రాన్ని అందజేశారు. త్వరలోనే ఆయన బీజేపీలో చేరబోతోన్నారు. ఈ నెల 21వ తేదీన ఆయన ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలుసుకోనున్నారు. ఆయన చేతుల మీదుగా కాషాయ కండువాను కప్పుకోనున్నారు.

టికెట్ హామీ..
ఈ చేరికల వేగాన్ని మరింత పెంచడానికి తెలంగాణ బీజేపీ నాయకులు సమాయాత్తం అయ్యారు. మరింత దూకుడుగా వ్యవహరించనున్నారు. కొంతకాలంగా క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తోన్న సీనియర్ నటి, మాజీ ఎమ్మెల్యే జయసుధతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఆమెను పార్టీలోకి చేర్చుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ సైతం ఖరారు చేస్తామని హామీ ఇస్తోన్నారు.

21న చేరాలంటూ..
జయసుధ.. ఇదివరకు ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నుంచి శాసనసభకు ఎన్నికైన విషయం తెలిసిందే. సికింద్రాబాద్ స్థానం నుంచి విజయం సాధించారు. 2009 ఎన్నికల సమయంలో అప్పటి టీడీపీ అభ్యర్థి తలసాని శ్రీనివాస్ యాదవ్ మీద పోటీ చేసి, గెలిచారు. ఆ తరువాత క్రియాశీలక రాజకీయాల్లో పెద్దగా పాల్గొనట్లేదు. ఇప్పుడు తాజాగా బీజేపీ నాయకులు ఆమెను సంప్రదించారు. ఈ నెల 21వ తేదీన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో పాటుగా పార్టీలో చేరాలని ఆహ్వానించారు.

ఆ డిమాండ్..
దీనిపై జయసుధ సానుకూలంగా స్పందించినప్పటికీ.. ఒకట్రెండు కండీషన్లు పెట్టినట్లు సమాచారం. తనకు పార్టీలో కీలక పదవిని అప్పగించాలని డిమాండ్ చేశారని తెలుస్తోంది. ఆమె పెట్టిన ఈ కండీషన్ మీద అప్పటికప్పుడు బీజేపీ నాయకులు ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోయారని, పార్టీలో అంతర్గతంగా చర్చించిన అనంతరం దీనికి సానుకూలమా? కాదా? అనేది వెల్లడిస్తామని హామీ ఇచ్చారనే ప్రచారం ఉంది












Click it and Unblock the Notifications