అసెంబ్లీలో స్పీకర్ తో సీఎం కేసీఆర్ భేటీ; కేసీఆర్ మార్క్ బడ్జెట్ తో హరీష్ రావు రెడీ!!
తెలంగాణ రాష్ట్ర శాసనసభ సమావేశాల నేపద్యంలో తొలిరోజు సోమవారం బడ్జెట్ ను ప్రవేశ పెట్టనున్నారు. 2022- 23 వార్షిక బడ్జెట్ ను తెలంగాణ మంత్రులు హరీష్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి ఉభయసభలలో ప్రవేశపెట్టనున్నారు. అసెంబ్లీలో ఆర్థిక మంత్రి హరీష్ రావు, శాసనమండలిలో శాసనసభా వ్యవహారాల మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి బడ్జెట్ ను ప్రవేశపెడతారు.
బడ్జెట్ ప్రతులను స్పీకర్ కు అందించిన మంత్రి హరీష్ రావు
ఈ మేరకు అసెంబ్లీ కి చేరుకున్న ఇరువురు మంత్రులు హరీష్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి బడ్జెట్ ప్రతులతో సిద్ధమయ్యారు. స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి కి మంత్రి హరీష్ రావు, శాసనమండలి ప్రొటెం చైర్మన్ ఖాద్రికి వేముల ప్రశాంత్ రెడ్డి బడ్జెట్ ప్రతులను సమర్పించారు. అంతకు ముందు జూబ్లీహిల్స్ వెంకటేశ్వర స్వామి ఆలయంలో మంత్రి హరీష్ రావు పూజలు నిర్వహించారు.
స్పీకర్ తో భేటీ అయిన సీఎం కేసీఆర్
ఇదిలా ఉంటే బడ్జెట్ సమావేశాల సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఉదయం 11 గంటలకు అసెంబ్లీకి చేరుకున్నారు. అసెంబ్లీ సమావేశాలకు వచ్చిన కేసీఆర్ కు అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచార్యులు స్వాగతం పలికారు. అనంతరం స్పీకర్ చాంబర్లో పోచారం శ్రీనివాస్ రెడ్డిని సీఎం కేసీఆర్ కలిశారు. సీఎం తో పాటు పోచారం శ్రీనివాస్ రెడ్డి ని కలిసిన వారిలో మంత్రి హరీష్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్ ఉన్నారు. తెలంగాణా బడ్జెట్ సమావేశాల నేపధ్యంలో సీఎం కేసీఆర్ పోచారం శ్రీనివాస రెడ్డితో మాట్లాడారు. మరికాసేపట్లో ఉభయసభల్లోనూ తెలంగాణ రాష్ట్ర 2022- 23 బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు.
Recommended Video
కేసీఆర్ మార్క్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్న మంత్రులు
బడ్జెట్ ను ఉద్దేశించి మంత్రి హరీష్ రావు ప్రజల ఆకాంక్షలు ప్రతిబింబించేలా ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని తెలంగాణ బడ్జెట్ ఉంటుందని పేర్కొన్నారు. మానవీయ కోణంలో బడ్జెట్ కు రూపకల్పన చేసినట్లుగా ఆయన వెల్లడించారు. 2022 -23 వార్షిక బడ్జెట్ కెసిఆర్ మార్క్ కనిపిస్తుందని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. రైతుల, పేద ప్రజల ఆకాంక్షలకు అద్దం పట్టేలా బడ్జెట్ ఉంటుందని మంత్రి హరీష్ రావు వెల్లడించారు. ప్రజా సంక్షేమానికి పెద్ద పీట వేస్తూ రూపొందించిన బడ్జెట్ అని ఆర్ధిక శాఖా మంత్రి హరీష్ రావు తెలిపారు.