ఆర్టీసీ కార్మికులకు,పంచాయతీ కార్యదర్శులకు సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్... అసెంబ్లీ నిరవధిక వాయిదా
తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు,ప్రొబెషనరీ పంచాయతీ కార్యదర్శులకు ముఖ్యమంత్రి కేసీఆర్ శుభవార్త చెప్పారు. త్వరలోనే ఆర్టీసీ కార్మికుల వేతనాలు పెంచుతామన్నారు. పంచాయతీ కార్యదర్శకులకు ఏప్రిల్ నుంచి రెగ్యులర్ ఉద్యోగులతో పాటు వేతనాలు చెల్లిస్తామన్నారు. అయితే ప్రొబేషన్ కాలాన్ని మరో ఏడాది పాటు పొడగిస్తున్నట్లు ప్రకటించడం గమనార్హం. నిరుద్యోగ భృతి ఇవ్వాలన్న సంకల్పం ఉన్నప్పటికీ... కరోనా పరిస్థితుల కారణంగా ఇవ్వలేకపోతున్నామని చెప్పారు. ఆర్థిక పరిస్థితులు ఒక కొలిక్కి వచ్చాక నిరుద్యోగ భృతి తప్పకుండా చెల్లిస్తామన్నారు. శుక్రవారం(మార్చి 26) అసెంబ్లీలో ద్రవ్య వినిమియ బిల్లుపై చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడారు.

తెలంగాణలో కోటి ఎకరాలు దాటిన సాగు : కేసీఆర్
దేశంలో వందకు వంద శాతం తాగునీరు అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని సీఎం కేసీఆర్ తెలిపారు. కోటి ఎకరాల మాగణం తమ కల అని... రాష్ట్రంలో ఇప్పుడు సాగు విస్తీర్ణం 1.25కోట్ల ఎకరాలకు చేరుకుందని వెల్లడించారు. వ్యవసాయ రంగంలో 17.73శాతం వృద్ది నమోదైందని చెప్పారు. ఏడాదిలో రూ.1లక్ష కోట్ల విలువైన పంటను తెలంగాణ ఉత్పత్తి చేసిందని... దేశంలో ఫుడ్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా(ఎఫ్సీఐ) సేకరించిన ధాన్యంలో 55శాతం తెలంగాణ నుంచి సేకరించినదేనని తెలిపారు. ఇది తాను చెప్పట్లేదని... ఎఫ్సీఐ సంస్థనే ఈ విషయం వెల్లడించిందని స్పష్టం చేశారు.

అప్పుల్లో 22వ స్థానం : కేసీఆర్
రాష్ట్రంలో తలసరి ఆదాయం,తలసరి విద్యుత్ వినియోగం గణనీయంగా పెరిగాయన్నారు. ఇక రాష్ట్రం అప్పుల పాలైందని కొంతమంది చేస్తున్న వాదన సరికాదని అన్నారు. దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణకు ఉన్న అప్పులు చాలా తక్కువ అన్నారు. అప్పుల విషయంలో తెలంగాణ దేశంలో 22వ స్థానంలో ఉందన్నారు. కరోనా పరిస్థితులకు తట్టుకుని తక్కువ అప్పులు చేసిన రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని చెప్పారు. తీసుకొచ్చిన అప్పులను సద్వినియోగం చేసుకున్నామని... ప్రాజెక్టుల కోసం వెచ్చించామని వెల్లడించారు. రాష్ట్రంలో వంద శాతం సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేసి తీరుతామన్నారు.

అసెంబ్లీ నిరవధిక వాయిదా...
రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం రూ.40వేల కోట్లు ఖర్చు చేస్తోందన్నారు. ఒక్క నాగార్జునసాగర్ నియోజకవర్గంలోనే సంక్షేమ పథకాల లబ్దిదారులు 1.43లక్షల మంది ఉన్నారని తెలిపారు. రాబోయే రోజుల్లో రాష్ట్రంలోని 141 మున్సిపాలిటీల్లో ఇంటిగ్రేటెడ్ వెజ్,నాన్వెజ్ మార్కెట్లను ఏర్పాటు చేస్తామన్నారు. త్వరలోనే ప్రజా దర్బార్ నిర్వహించి గిరిజనుల పోడు భూముల సమస్యకు పరిష్కారం చూపుతామన్నారు. సీఎం కేసీఆర్ ప్రసంగం అనంతరం ద్రవ్య వినిమయ బిల్లుకు సభ ఆమోదం తెలిపింది. ఆ తర్వాత సభను నిరవధిక వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు.దాదాపు 12 రోజుల పాటు సాగిన అసెంబ్లీ సమావేశాల్లో మూడు ప్రభుత్వ బిల్లులతో పాటు 2021-22 బడ్జెట్ను సభ ఆమోదించింది.












Click it and Unblock the Notifications