హైదరాబాద్లో 3 టిమ్స్ ఆస్పత్రులకు కేసీఆర్ శంకుస్థాపన: ఆయా జిల్లాల ప్రజలు నేరుగా
హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరానికి నలుమూలలా తెలంగాణ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(టిమ్స్) ఆస్పత్రుల నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. నగరంలోని అల్వాల్, గడ్డిఅన్నారం, ఎర్రగడ్డ ప్రాంతాల్లో ఈ ఆస్పత్రుల నిర్మాణానికి సీఎం కేసీఆర్ మంగళవారం భూమిపూజ చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు హరీశ్ రావు, ప్రశాంత్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, మహముద్ అలీ, వేముల ప్రశాంత్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, మల్లారెడ్డి, ఎమ్మెల్యేలు మాగంటి గోపీనాథ్, సుధీర్ రెడ్డి, మైనంపల్లి హన్మంత్ రావు, వివేకానంద గౌడ, కాలేరు వెంకటేశ్, సాయన్న, రాజ్యసభ సభ్యులు కే కేశవరావు, జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మితో పాటు పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
హైదరాబాద్లో మూడు కొత్త టిమ్స్ ఆస్పత్రులు.. సూపర్ స్పెషాలిటీ
ఈ మూడు ఆస్పత్రుల్లో స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందుతాయి. వైద్య విద్య కోసం పీజీ స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ సీట్లు, నర్సింగ్, పారా మెడికల్ కాలేజీలు కూడా అందుబాటులోకి రానున్నాయి. ఒక్కో టిమ్స్ను 1000 బెడ్ల సౌకర్యంతో నిర్మించనున్నారు. ప్రతి ఆస్పత్రిలో 26 ఆపరేషన్ థియేటర్లు, 300 ఐసీయూ బెడ్స్తో పాటు ఆక్సిజన్ సౌకర్యం అందుబాటులోకి రానుంది. గ్రేటర్ చుట్టూ నిర్మించనున్న నాలుగు సూపర్ స్పెషాల్టీ దవాఖానల వల్ల రాష్ట్రంలోని పలు జిల్లాలకు చెందిన ప్రజలకు కూడా వైద్యసేవలు మరింత చేరువకానున్నాయి.
రూ. 882 కోట్లతో ఎర్రగడ్డ టిమ్స్:
ఎర్రగడ్డ(సనత్నగర్) టిమ్స్ 17 ఎకరాల్లో జీ ప్లస్ 14 అంతస్తుల్లో వెయ్యి పడకల ఆస్పత్రిని నిర్మించనున్నారు. ఈ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కు రూ. 882 కోట్లు కేటాయించారు. నగరంలోని ప్రజలకు ఈ టిమ్స్ తో వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయి.
రూ. 900 కోట్లతో కొత్తపేట(గడ్డిఅన్నారం) టిమ్స్:
కొత్తపేట(గడ్డిఅన్నారం) టిమ్స్ 21.36 ఎకరాల్లో జీ ప్లస్ 14 అంతస్తుల్లో వెయ్యి పడకల ఆస్పత్రిని నిర్మించనున్నారు. ఈ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కు రూ.900 కోట్లు కేటాయించారు. గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్లో నిర్మించనున్న సూపర్ స్పెషాల్టీ ఆస్పత్రితో నల్గొండ, వరంగల్, యాదాద్రి-భువనగిరి తదితర జిల్లాల ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయి.
28 ఎకరాల్లో రూ. 897 కోట్లతో అల్వాల్ టిమ్స్:
అల్వాల్ టిమ్స్ 28.41 ఎకరాల్లో జీ ప్లస్ 5 అంతస్తుల్లో వెయ్యి పడకల ఆస్పత్రిని నిర్మించనున్నారు. ఈ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కు రూ.897 కోట్లు కేటాయించారు. ముఖ్యంగా అల్వాల్-ఓఆర్ఆర్ మధ్య నిర్మించనున్న సూపర్ స్పెషాల్టీ ఆస్పత్రితో.. సిద్దిపేట, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, నిర్మల్ తదితర జిల్లాల ప్రజలు ట్రాఫిక్ సమస్య లేకుండా సులువుగా చేరుకోవచ్చు. అంతేకాకుండా వైద్యసేవలు సకాలంలో పొందే వీలుంటుంది.
గచ్చిబౌలి టిమ్స్తో సమీప జిల్లా ప్రజలకు వైద్య సేవలు
గచ్చిబౌలిలోని టిమ్స్తో రంగారెడ్డి, సంగారెడ్డి, మెదక్ జిల్లాల ప్రజలకు వైద్యసేవలు చేరువ కావడంతో పాటు సులభంగా ఆస్పత్రులకు చేరుకునే వీలుంటుంది. ఆ జిల్లాల నుంచి వచ్చే రోగులు నగరంలోని నిమ్స్, ఉస్మానియా, గాంధీ వంటి ఆస్పత్రులకు వెళ్లాల్సిన అవసరం లేకుండా గ్రేటర్ సరిహద్దులో ఉన్న నూతన సూపర్స్పెషాలిటీ ఆస్పత్రుల ద్వారా సేవలు పొందే వీలుంటుంది. ఈ నాలుగు సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులతో ప్రజలకు మెరుగైన వైద్యం మరింత అందుబాటులోకి రానుంది.