కుట్రలు, విద్వేష రాజకీయాలా?: కేంద్రాన్ని మరోసారి ఏకిపారేసిన సీఎం కేసీఆర్
హైదరాబాద్: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై మరోసారి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు తెలంగాణ సీఎం కేసీఆర్. గోల్కొండ కోటపై జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం ఆయన ప్రసంగించారు. తెలంగాణ అన్ని రంగాల్లో దూసుకుపోతోందన్నారు. అయితే, కేంద్రం మాత్రం రాష్ట్రాల అభివృద్ధికి సహకరించడం లేదని ఆరోపించారు.

సమాఖ్య విలువలకు తూట్లు అంటూ కేంద్రంపై కేసీఆర్ ఫైర్
రాష్ట్రాలను ఆర్థికంగా బలహీనపరిచే కుట్రలకు కేంద్రం తెరలేపిందని కేసీఆర్ మండిపడ్డారు. కేంద్ర రాష్ట్రాలు జోడు గుర్రాల మాదిరిగా ప్రగతిరథాన్ని నడిపించాలని రాజ్యాంగవేత్తలు కోరుకున్నారన్నారు. అందుకే సమాఖ్య స్వరూపాన్ని ఏర్పాటు చేశారని చెప్పారు. ఢిల్లీ గద్దె మీద కూర్చొన్న ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం సమాఖ్య విలువలకు తూట్లు పొడుస్తున్నదని కేసీఆర్ ధ్వజమెత్తారు. కూచున్న కొమ్మను నరుక్కున్న చందంగా రాష్ట్రాలను ఆర్థికంగా బలహీనపరిచే కుట్రలకు కేంద్రం పాల్పడుతోందని విమర్శించారు.

రాష్ట్రాలకు పన్నులో వాటా తగ్గించిన కేంద్రం: కేసీఆర్
కేంద్రం పన్నుల రూపంలో వసూలు చేసే ఆదాయం మొత్తంలోంచి న్యాయబద్ధంగా 41శాతం వాటా రాష్ట్రాలకు చెల్లించాలన్నారు కేసీఆర్. కేంద్రం ఈ వాటాను కుదించాలనే దురుద్దేశంతో పన్నుల రూపంలో కాకుండా సెస్సుల విధింపు రూపంలో దొడ్డిదారిన ఆదాయం సమకూర్చుకుంటోందన్నారు. దీని ద్వారా రాష్ట్రాలకు 2022-23లో రావాల్సిన ఆదాయంలో 11.4 శాతం గండి కొడుతోందన్నారు. అంటే రాష్ట్రాలకు 41 శాతం వాటా రావాల్సిన చోట 29.6 శాతం మాత్రమే ఇచ్చి అన్యాయం చేస్తోందని మండిపడ్డారు. ఇది చాలదన్నట్లు రాష్ట్రాల ఆర్ధిక స్వేచ్ఛను దెబ్బతీస్తూ నిరంకుశంగా రకరకాల ఆంక్షలు విధిస్తున్నదని తెలిపారు.

కేంద్రం తొలి అధికరణాన్నే అపహాస్యం చేస్తోందన్న కేసీఆర్
రాష్ట్రాలు ఎఫ్ఆర్బీఎం పరిమితిలో తీసుకొనే రుణాల మీద సైతం కేంద్రం కోతలు విధిస్తున్నదని తెలిపారు. సంక్షేమం, అభివృద్ధి కోసమే తమ ప్రభుత్వం అప్పులు చేస్తోందన్నారు. సహకార సమాఖ్య స్ఫూర్తి అంటూ.. ఆదర్శాలను వల్లించే కేంద్ర సర్కారు ఆచరణలో మాత్రం అధికారాల కేంద్రీకరణకు పాల్పడుతుంనదని కేసీఆర్ విమర్శించారు. ఇండియాను యూనియన్ ఆప్ స్టేట్స్ అని పేర్కొన్న రాజ్యాంగం తొలి అధికరణాన్నే అపహాస్యం పాలుచేస్తుందని కేంద్రంపై ధ్వజమెత్తారు. ఉమ్మడి జాబితాలోని అంశాల్లో రాష్ట్రాలను సంప్రదించకుండానే నిర్ణయాలు తీసుకొని రాష్ట్రాల నెత్తిన రుద్దుతోందని కేసీఆర్ విమర్శించారు. రైతు వ్యతిరేకమైన నల్ల చట్టాలను కేంద్రం ఈవిధంగానే రుద్దాలని చూసిందన్నారు. ఆ చట్టాలకు వ్యతిరేకంగా రాజధాని ఢిల్లీలో నిరసన చేపట్టిన రైతుల మీద విచక్షణా రహిత హింసను ప్రయోగించటమే కాకుండా, వారిని దేశ ద్రోహులుగా చిత్రించే ప్రయత్నానికి కూడా కేంద్ర సర్కారు ఒడిగట్దిందన్నారు. చిట్ట చివరికి రైతుల పోరాటానికి తలవొగ్గి నల్లచట్టాలను వెనక్కి తీసుకుందన్నారు. స్వయంగా దేశ ప్రధానే రైతులకు బహిరంగ క్షమాపణలు చెప్పవలసి వచ్చిందని కేసీఆర్ గుర్తు చేశారు.

పేద ప్రజలపై భారం మోపుతున్నారు: కేంద్రంపై కేసీఆర్
పసిపిల్లలు తాగే పాలు మొదలుకొని, శ్మశానవాటికల నిర్మాణం దాకా ప్రజల అవసరాలన్నిటి మీద కేంద్రం ఎడాపెడా పన్నులు విధిస్తూ పేద, మధ్యతరగతి ప్రజలపై విపరీతమైన భారం మోపుతోందని కేసీఆర్ మండిపడ్డారు. ప్రజా సంక్షేమం ప్రభుత్వాల ప్రధాన బాధ్యత, కేంద్రం ఆ బాధ్యతను సరిగా నిర్వర్తించకపోగా పేదలకు అందించే సంక్షేమ పథకాలకు "ఉచితాలు" అనే పేరును తగిలించి అవమానించడం గర్హనీయమని కేసీఆర్ వ్యాఖ్యానించారు.

విద్వేష రాజకీయాలంటూ కేసీఆర్ విమర్శలు
కేంద్ర సర్కారు అసమర్థ నిర్వాకం వల్ల దేశ ఆర్థికాభివృద్ధి కుంటుపడిందని కేసీఆర్ మండిపడ్డారు. ద్రవ్యోల్బణం పెరిగి నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. అంతర్జాతీయ విపణిలో రూపాయి విలువ నానాటికి తీసికట్టు నాగంభొట్లు అన్న తీరుగా ఎన్నడూ లేనంతగా పడిపోయింది. దేశంలో నిరుద్యోగం తీవ్రతరమౌతోంది. కేంద్రంలో అధికారంలో ఉన్న పెద్దలు తమ వైఫల్యాలను కప్పిపుచ్చేందుకు విద్వేష రాజకీయాలతో ప్రజలను విభజిస్తూ నీచమైన ఎత్తుగడలకు పాల్పడుతున్నారని సీఎం మండిపడ్డారు. జాతి నిర్మాతలైన ఎందరో మహానుభావుల కృషి ఫలితంగా భిన్న మతాలూ, ప్రాంతాలు, భాషలూ, సంస్కృతులు కలిగిన భారత సమాజంలో పరస్పర విశ్వాసం, ఏకత్వ భావన పాదుకున్నాయి. తరతరాలుగా భారతదేశం నిలబెట్టుకుంటూ వస్తున్న శాంతియుత సహజీవనాన్ని విచ్ఛిన్నం చేసేందుకు రాజ్యంగ పదవుల్లో ఉన్నవారే నేడు ఫాసిస్టు దాడులకు పాల్పడుతున్నారు. ఈ దుర్మార్గాన్ని చూసి కచ్చితంగా స్వాతంత్ర సమరయోధుల ఆత్మలు ఘోషిస్తాయని కేసీఆర్ అన్నారు.












Click it and Unblock the Notifications