ఢిల్లీకి రేవంత్ రెడ్డి: పార్టీ అగ్రనేతలతో చర్చలు, ప్రధాని మోడీతో భేటీకి ఛాన్స్
తెలంగాణ ముఖ్యమంత్రి, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మంగళవారం ఢిల్లీ బయల్దేరి వెళ్లనున్నారు. త్వరలో తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశం ఉందని ప్రచారం జరుగుతున్న వేళ రేవంత్ ఢిల్లీ పర్యటనకు ప్రాధాన్యత సంతరించుకుంది. కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలతో రేవంత్ సమావేశం కానున్నారు.
మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పదవుల భర్తీపై హైకమాండ్తో సీఎం రేవంత్ చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో రేవంత్ రెడ్డి మర్యాదపూర్వకంగా భేటీ అయ్యే అవకాశాలున్నట్లు కాంగ్రెస్ పార్టీ వర్గాలు తెలిపాయి. డిసెంబర్ 20న అసెంబ్లీ సమావేశంఉండటంతో మంగళవారం రాత్రికే సీఎం రేవంత్ హైదరాబాద్ రానున్నట్లు సమాచారం.

కొత్త పారిశ్రామిక వాడల కోసం సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
తెలంగాణ రాష్ట్రంలో నూతన పారిశ్రామిక వాడలను ఏర్పాటు చేసేందుకు భూములు సేకరించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశించారు. ఓఆర్ఆర్కు బయట, రీజినల్ రింగ్ రోడ్కు లోపల 500 నుంచి 1000 ఎకరాల మేర భూములను గుర్తించాలన్నారు. అవి కూడా విమానాశ్రయాలకు, జాతీయ రహదారులు, స్టేట్ రహదారులకు 50 నుంచి 100 కిలోమీటర్ల దూరంలోపే ఉండాలని స్పష్టం చేశారు.
పరిశ్రమల కోసం సేకరించే భూములు, బంజరు భూములై ఉండటంతోపాటు సాగుకు యోగ్యంకాని కానివిగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు. దీనివల్ల రైతులకు నష్టం లేకుండా కాలుష్యం తక్కువగా ఉండేట్లు అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలన్న అభిప్రాయాన్ని సీఎం రేవంత్ వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పరిశ్రమలకు కేటాయించిన భూములు, అవి పారిశ్రామిక అవసరాలకు ఉపయోగించకుండా ఉన్న భూములపై పూర్తి వివరాలు అందచేయాలని సీఎం అధికారులను ఆదేశించారు.
రాష్ట్రంలోని పారిశ్రామికాభివృద్ధిపై సోమవారం సచివాలయంలో జరిగిన సమావేశంలో రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, ఆర్థిక, ప్రణాళిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్కతో కలిసి ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్, మున్సిపల్ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి దాన కిషోర్, పరిశ్రమల శాఖ డైరెక్టర్ కృష్ణ భాస్కర్, సీఎంఓ అధికారులు శేషాద్రి, శివధర్ రెడ్డి, షా-నవాజ్ ఖాసీం తదితరులు హాజరయ్యారు.












Click it and Unblock the Notifications