మోడీ, చంద్రబాబు ప్రభుత్వ బడుల్లోనే: తాను కూడా అంటూ సీఎం రేవంత్
కార్పొరేట్ పాఠశాలలతో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు పోటీపడటం తమ గౌరవాన్ని మరింత పెంచిందన్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. అలాంటి విద్యార్థిని విద్యార్థులకు తన హృదయపూర్వక అభినందనలు తెలిపారు. రవీంద్ర భారతిలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ప్రతిభా పురస్కారాల ప్రదానోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొని విద్యార్థులకు పురస్కారాలు అందించారు.
ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఇలాంటి కార్యక్రమాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తే బాగుండేదన్నారు. వందేమాతరం ఫౌండేషన్ ఇలాంటి మంచి కార్యక్రమం ద్వారా తమ బాధ్యతను గుర్తు చేసిందని, ప్రైవేట్ పాఠశాలలతో పోటీపడి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు రాణించడం ప్రభుత్వానికి గర్వకారణమన్నారు. 90శాతం ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ప్రభుత్వ పాఠాశాలల్లో చదివినవారేనని చెప్పారు.

అంతేగాక, తనతో సహా ప్రముఖ రాజకీయ నాయకులు, దేశ ప్రధాని నరేంద్ర మోడీ, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఒకప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లో చదివామని సీఎం రేవంత్ చెప్పారు. విద్యార్థులు రావడం లేదని సింగిల్ టీచర్ పాఠశాలలను మూసివేసే పరిస్థితి గత ప్రభుత్వంలో ఉండేదని.. మౌలిక వసతులపై దృష్టి కేంద్రీకరించకపోవడం వల్లే ఈ పరిస్థితి అని అన్నారు. కానీ, సింగిల్ టీచర్ పాఠశాలలను మూసేయొద్దని తమ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని సీఎం రేవంత్ తెలిపారు.
ప్రతీ గ్రామం, ప్రతీ తండాకు విద్యను అందించేలా ప్రభుత్వం ముందుకెళుతుంది. శిథిలావస్థకు చేరిన అన్ని ప్రభుత్వ పాఠశాలల భవనాలను పునర్నిర్మించేందుకు రూ.2వేల కోట్లతో పనులు ప్రారంభించాం. విద్యార్థులను బడిలో చేర్పించేందుకు ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహిస్తోందని సీఎం రేవంత్ చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల నిర్వహణను మహిళా సంఘాలకు అప్పగించామని, గ్రీన్ ఛానెల్ ద్వారా నిధులు విడుదల చేయాలని అధికారులను ఆదేశించామని తెలిపారు.
ప్రభుత్వ పాఠశాలల్లో సెమీ రెసిడెన్షియల్ విధానాన్ని అమలు చేసే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోందని సీఎం రేవంత్ వివరించారు. రెసిడెన్షియల్ స్కూల్ ద్వారా తల్లదండ్రులకు పిల్లల సంబంధాలు బలహీనపడుతున్నాయని ఒక స్టడీ రిపోర్ట్ వచ్చింది. గ్రామాల్లో ఉండే పాఠశాలలపై నిర్లక్ష్యం వహించొద్దు.. విద్య మీద ప్రభుత్వం పెట్టేది ఖర్చు కాదు.. పెట్టుబడి.. విద్యపై పెట్టె పెట్టుబడి మన సమాజానికి లాభాన్ని చేకూరుస్తుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి.
10/10 వచ్చిన విద్యార్థుల అడ్మిషన్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులకు ఆదేశించారు. ఇంటర్మీడియట్ లోనూ స్టేట్ ర్యాంకులు సాధించి భవిష్యత్ లో రాణించాలని ఆకాంక్షిస్తున్నా.. మీకు ప్రజా ప్రభుత్వం ఉంది.. ప్రజా పాలనపై నమ్మకం కలిగించేలా ముందుకెళతామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. త్వరలో విద్య, వ్యవసాయ కమిషన్ లను ఏర్పాటు చేసి నిరంతరం సమస్యలను పరిష్కరించే వెసులుబాటు కల్పించబోతున్నామని సీఎం రేవంత్ చెప్పారు.












Click it and Unblock the Notifications