హైద్రాబాద్లో కర్ణాటక ఎమ్మెల్యేలకు కాంగ్రెస్ ఎమ్మెల్యే వంశీ స్వాగతం
Recommended Video
హైదరాబాద్: కర్ణాటక రాష్ట్ర రాజకీయాలు హైద్రాబాద్కు మారాయి. ఈ తరుణంలో హైద్రాబాద్ లో కర్ణాటక రాష్ట్ర ఎమ్మెల్యేలకు హోటల్స్లో బస ఏర్పాట్లను కాంగ్రెస్ పార్టీకి చెందిన కల్వకుర్తి ఎమ్మెల్యే చల్లా వంశీచంద్ రెడ్ది దగ్గరుండి పరిశీలిస్తున్నారు.
కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రిగా యడ్యూరప్ప ప్రమాణస్వీకారం చేశారు. 15 రోజుల్లోపుగా యడ్యూరప్ప అసెంబ్లీలో బలనిరూపణ చేసుకోవాల్సి ఉంది. ఈ తరుణంలో కాంగ్రెస్, జెడి(ఎస్) ఎమ్మెల్యేలను రక్షించేందుకు గాను కాంగ్రెస్ పార్టీ నేతలు హైద్రాబాద్ కు తరలించారు. మూడు బస్సుల్లో శుక్రవారం ఉదయం పూట హైద్రాబాద్ కు చేరుకొన్నారు.
కర్ణాటక రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నేతలు, ఎఐసీసీ నేతలు కర్ణాటక ఎమ్మెల్యేలు హైద్రాబాద్ కు వస్తున్న విషయాన్ని గురువారం రాత్రి పూట పీసీసీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డికి సమాచారం ఇచ్చారు. ఈ సమాచారం ఆధారంగా హైద్రాబాద్ లోని పలు హోటల్స్ లో ఎమ్మెల్యేలు బస చేసేందుకు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ నాయకత్వం ఏర్పాట్లు చేసింది.
కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు తాజ్ కృష్ణా, నోవాటెల్, గోల్కొండ హోటల్స్ ను బుక్ చేశారు. తొలుత అనుకొన్నట్టుగా పార్క్ హయత్ హోటల్ కు ఎమ్మెల్యేలు రాలేదు. తాజ్ కృష్ణ హోటల్ లో ఎమ్మెల్యేల కోసం సుమారు 20 రూమ్స్ బుక్ చేశారు.
హోటల్స్ వద్ద ఏర్పాట్లను కల్వకర్తి ఎమ్మెల్యే చల్లా వంశీధర్ రెడ్డి పర్యవేక్షించారు. వంశీతో పాటు హైద్రాబాద్ నగరానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నేతలు కూడ ఈ మేరకు కాంగ్రెస్, జెడి(ఎస్) ఎమ్మెల్యేలను హోటల్ వద్ద సాదరంగా స్వాగతం పలికారు.