కొత్తగూడెంలో విద్యార్థిని మృతిపై భగ్గు: అత్యాచారం, హత్యగా అనుమానాలు: రెండురోజులైనా
హైదరాబాద్: తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెంలో డిగ్రీ విద్యార్థిని దేవిక అనుమానాస్పద మృతి పట్ల స్థానికులు భగ్గుమంటున్నారు. విద్యార్థిని కుటుంబానికి న్యాయం చేయాలంటూ నినదిస్తున్నారు. నెటిజన్లు సైతం ఈ ఘటనపై నిరసనలను వ్యక్తం చేస్తున్నారు. జస్టిస్ ఫర్ దేవిక పేరును ట్రెండ్ చేస్తున్నారు. దేవిక మరణాన్ని ప్రమాదంగా సృష్టించడానికి నిందితులు ప్రయత్నిస్తున్నారని మండిపడుతున్నారు. ఈ ఘాతుకానికి పాల్పడిన వారిపట్ల కఠిన చర్యలను తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటన పట్ల కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు సైతం స్పందించారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని గరిమెళ్లపాడు వద్ద గరిమెళ్లపాడు, 3 ఇంక్లయిన్ కాలనీ సమీపంలోని రైలు పట్టాలపైద దేవిక మృతదేహం లభించిన విషయం తెలిసిందే. అర్ధనగ్న స్థితిలో ఉన్న మృతదేహాన్ని గమనించిన వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మృతురాలి గురించి ఆరా తీయగా.. కొత్తగూడేనికి చెందిన అశోక్ కుమార్ కుమార్తె దేవికగా గుర్తించారు. ఇంటర్మీడియట్ను పూర్తి చేసుకున్న ఆమె ఈ ఏడాది డిగ్రీలో చేరాల్సి ఉంది.
మంగళవారం రాత్రి ఇంట్లో నిద్రించిన దేవిక కనిపించకుండా పోయిందని, ఆమె గురించి రాత్రంతా గాలించామని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. తెల్లవారే సరికి గరిమెళ్లపాడు సమీపంలో పట్టాలపై మృతదేహాన్ని పోలీసులు గుర్తించి, తమకు సమాచారం ఇచ్చారని అంటున్నారు. తమ కుమార్తె కనిపించట్లేదని స్థఆనిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా చేశామని అన్నారు. దేవిక కుటుంబ సభ్యులు అదే ప్రాంతానికి చెందిన సందీప్ అనే యువకుడిపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తమ కుమార్తెను అత్యాచారానికి పాల్పడి, హత్య చేసి ఉంటారని అనుమానిస్తున్నారు. ప్రస్తుతం సందీప్ అనే యువకుడు కూడా కనిపించట్లేదని తెలుస్తోంది.
Recommended Video
ఈ ఘటనపై స్థానిక టీఆర్ఎస్ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర రావు స్పందించారు. దీనిపై తాను దేవిక కుటుంబ సభ్యులతో మాట్లాడానని, వారికి న్యాయం కల్పించేలా చర్యలు తీసుకుంటానని అన్నారు. దేవిక మృతి వెనుక గల అసలు కారణాలను వెలికి తీస్తామని భరోసా ఇచ్చారు. ఫాస్ట్ట్రాక్ ద్వారా దర్యాప్తు జరిపించేలా ఆదేశాలను జారీ చేసినట్లు చెప్పారు. ఈ కేసులో నిందితులను త్వరలోనే పోలీసులు పట్టుకుంటారని అన్నారు. ఇలాంటి అమానవీయ ఘటనలకు సభ్య సమాజంలో తావు లేదని అన్నారు. ఈ ఘటనను తాను వ్యక్తిగతంగా పర్యవేక్షిస్తున్నానని చెప్పారు.