రోహిత్ వేముల మృతి కేసు క్లోజ్: గంటల వ్యవధిలోనే రీఓపెన్కు డీజీపీ ఆదేశం
హైదరాబాద్: దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన హైదరాబాద్ యూనివర్సిటీ విద్యార్థి రోహిత్ వేముల ఆత్మహత్య కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. రోహిత్ ఆత్మహత్యకు ఎవరూ కారణం కాదని శుక్రవారం పోలీసులు హైకోర్టుకు నివేదిక సమర్పించారు. ఈ కేసు తెలంగాణ హైకోర్టులో విచారణకు రాగా.. ఆధారాలు లేవని కేసు క్లోజ్ చేశారు. అంతేగాక, రోహిత్ దళితుడు కాదని పేర్కొన్నారు.
రోహిత్ ఆత్మహత్యకు అప్పటి హెచ్సీయూ వీసీ అప్పారావుకు ఎలాంటి సంబంధం లేదని తేల్చారు. యూనివర్సిటీ నిబంధనలకు లోబడే వైస్ ఛాన్సలర్ చర్యలు తీసుకున్నారని పోలీసులు తమ నివేదికలో పేర్కొన్నారు. అంతేగాక, రోహిత్ ఎస్సీ సామాజిక వర్గానికి చెందినవాడని చెప్పడానికి ఎలాంటి ఆధారాలు లేవని వెల్లడించారు. తన కులానికి సంబంధించిన విషయంలోనే రోహిత్ ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని పేర్కొన్నారు.

ఈ నేపథ్యంలో తెలంగాణతోపాటు దేశ వ్యాప్తంగా పలు యూనివర్సిటీల్లో విద్యార్థులు ఆందోళనలకు దిగారు. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం ఈ కేసు విషయంలో సీరియస్ అయ్యింది. దీంతో తెలంగాణ పోలీసు శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రోహిత్ వేముల కేసు పునర్విచారణ చేయాలని పోలీసులు నిర్ణయించుకున్నారు.
రోహిత్ వేముల మృతి కేసును రీఓపెన్ చేయాలని తెలంగాణ డీజీపీ రవి గుప్తా.. సైబరాబాద్ సీపీని ఆదేశించారు. ఈ క్రమంలోనే కేసు పునర్విచారణకు అనుమతి ఇవ్వాలని తెలంగాణ హైకోర్టును రాష్ట్ర పోలీసు శాఖ పిటిషన్ దాఖలు చేసింది.
కాగా, 2016లో జనవరిలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో రోహిత్ వేముల ఆత్మహత్య చేసుకోవడం దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి. ఈ కేసులో పలువురు బీజేపీ నేతలు, అప్పటి వీసీ అప్పారావుపై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే, వీళ్లకు ఈ ఘటనతో ఎలాంటి సంబంధం లేదని గత ప్రభుత్వం తేల్చింది. ఈ క్రమంలోనే ఈ ఏడాది మార్చిలో క్లోజర్ రిపోర్టును ఫైల్ చేశారు. మే3న హైకోర్టుకు సమర్పించారు సైబరాబాద్ పోలీసులు. అయితే, తాజాగా, ఈ కేసును పునర్విచారించాలని పోలీసు శాఖ నిర్ణయించుకుంది.












Click it and Unblock the Notifications