తెలంగాణ ఎంసెట్ లో ఏపీ విద్యార్థుల సత్తా : టాపర్లలో ఆరుగురు ఏపీ నుంచే
హైదరాబాద్ : తెలంగాణ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి తెలంగాణ ఎంసెట్ ఫలితాలను విడుదల చేశారు. రాష్ట్ర సచివాలయంలో విడుదల చేసిన ఈ ఫలితాల్లో పలువురు విద్యార్థులు సత్తా చాటారు. ఎంసెట్ పరీక్షకు సంబంధించి ఇంజినీరింగ్ విభాగంలో మొత్తం 1,33,428 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు.
విశేషమేంటంటే.. మొన్నటి ఏపీ ఎంసెట్ ఫలితాల్లో తెలంగాణ విద్యార్థులు సత్తా చాటితే, తాజా తెలంగాణ ఎంసెట్ ఫలితాల్లో ఏపీ విద్యార్థులు సత్తా చాటారు. ఏపీ ఎంసెట్ టాప్-10 జాబితాలో ఆరుగురు తెలంగాణ విద్యార్థులు చోటు సంపాదించగా, నేటి తెలంగాణ ఎంసెట్ ఫలితాల్లోను ఆరుగురు ఏపీ విద్యార్థులు టాప్-10 లో చోటు దక్కించుకోవడం గమనార్హం.
ఫలితాలు విడుదల కావడంతో జూన్ 6వ తేదీనుంచి ర్యాంక్ కార్డులను అభ్యర్థులకు ఆన్ లైన్ లో అందుబాటులో ఉంచనున్నారు అధికారులు. ఇక ఫలితాల విషయానికి వస్తే.. ఇంజినీరింగ్ విభాగంలో తళ్లూరి సాయితేజ ఎంసెట్ ఇంజనీరింగ్ టాపర్ గా నిలిచాడు.

ఎంసెట్ టాప్-10 అభ్యర్థుల జాబితా :
మొదటి ర్యాంకు- తళ్లూరి సాయితేజ (160/160)
రెండవ ర్యాంకు- దిగుమర్తి చేతన్సాయి (159/160)
మూడవ ర్యాంకు- గుండా నిఖిల్ సామ్రాట్ 158/160)
నాల్గొవ ర్యాంకు- కొండా విఘ్నేశ్రెడ్డి (158/160)
ఐదవ ర్యాంకు- చుండూరు రాహుల్ (158/160-గుంటూరు)
ఆరోర్యాంకు- బండారు వెంకటసాయి గణేష్ (157/160- గుంటూరు)
ఏడవ ర్యాంకు- కొండేటి తన్మయి (157//160-విజయనగరం)
ఎనిమిదవ ర్యాంకు- గంటా గౌతమ్ (157/160-పశ్చిమగోదావరి)
తొమ్మిదవ ర్యాంకు- నంబూరి జయకృష్ణ సాయివినయ్ (157/160-గుంటూరు)
పదవ ర్యాంకు- సత్తి వంశీ కృష్ణారెడ్డి (157/160-విశాఖపట్నం)
సచివాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరితో పాటు రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ మండలి ఛైర్మన్ కందాల పాపిరెడ్డి సహా తదితరులు పాల్గొన్నారు. కాగా, ఎంసెట్-2016 ప్రవేశ పరీక్షను మే 15న రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన విషయం తెలిసిందే. ఇందులో ఇంజినీరింగ్ విభాగం నుంచి 1,33,428 మంది విద్యార్థులు పరీక్ష హాజరవగా, మెడికల్ విభాగంలో 90,114 మంది విద్యార్థులు పరీక్ష రాశారు.












Click it and Unblock the Notifications