ఉద్యోగులకు గుడ్ న్యూస్: పీఆర్సీ నివేదిక సిద్దం...అమలు ముహూర్తం ఖరారు: ఫిట్మెంట్ ఎంతంటే..!
తెలంగాణ ఉద్యోగులు సుదీర్ఘ కాలంగా ఎదరు చూస్తున్న పదో వేతన సంఘం అమలు దిశగా అడుగులు పడుతున్నాయి. గత ఏడాది జరిగిన ముందస్తు అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ పీఆర్సీ కాకున్నా..మధ్యంతర భృతి ప్రకటిస్తారని ఆశించారు. అయితే, ఎన్నికలు పూర్తయి రెండో సారి ముఖ్యమంత్రిగా కేసీఆర్ అధికార పగ్గాలు చేపట్టి సంవత్సరం పూర్తయింది. ఇక, ఇప్పుడు రాష్ట్రంలో నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల్లో వెంటనే పీఆర్సీ నివేదిక ఇవ్వాలని సీఎం సూచించారు. ఇందు కోసం ముహూర్తం ఖరారైంది. నివేదిక అందిన రోజే ఉద్యోగ సంఘాల నేతలతో ముఖ్యమంత్రి సమావేశం కానున్నారు. పీఆర్సీ కమీషన్ సిఫార్సు చేసిన ఫిట్ మెంట్ పైన చర్చించి..అందరి ఆమోదంతో చెల్లింపు ఏ రకంగా ఉంటే అంశాన్ని ప్రభుత్వం అధికారికంగా ఖరారు చేయనుంది.
ఈ నెల22న పీఆర్సీ నివేదిక..
పదే వేతన సంఘం సిఫార్సులను ఈ నెల 22న ప్రభుత్వానికి అందనుంది. ఈ మేరకు ప్రభుత్వం జరిపిన చర్చల ఫలితంగా ముహూర్తం ఖరారైంది. రాష్ట్ర విభజన జరిగిన తరువాత 2015లో అటు ఏపీ..ఇటు తెలంగాణ ప్రభుత్వాలు 43 శాతం అమలు చేసాయి. ఇక, కొద్ది నెలల క్రితం ఏపీలో అధికారంలోకి వచ్చిన జగన్..ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే ఏపీ ఉద్యోగులకు 27 శాతం మధ్యంతర భృతి ప్రకటించి..అమలు చేస్తున్నారు. ఇక, ఇప్పుడు తెలంగాణలో ఆర్టీసీ సమ్మె...ఉద్యోగ సంఘాల మద్దతు నేపథ్యంలో ప్రభుత్వం పీఆర్సీ అమలు దిశగా నిర్ణయం తీసుకుంది. హుజూర్ నగర్ ఉప ఎన్నిక తరువాత నిర్ణయం ఉంటుందని గతంలోనే సీఎం స్పష్టం చేసారు. దీంతో..22న ప్రభుత్వానికి పీఆర్సీ నివేదిక అందనుంది.
ఫిట్మెంట్ 24%..అదే రోజు కీలక భేటీ..
పీఆర్సీ నివేదిక ఈ నెల 22న ప్రభుత్వానికి అందేలా నిర్ణయం జరిగింది. ప్రభుత్వానికి అధికారికంగా నివేదిక అందగానే అదే రోజు ఉద్యోగ సంఘాలతో ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశం అవుతారని తెలుస్తోంది. పీఆర్సీ సిఫార్సులు.. రాష్ట్రంలో ఆర్దిక పరిస్థితిని స్వయంగా ముఖ్యమంత్రి ఉద్యోగ సంఘాల నేతలకు వివరించనున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు పీఆర్సీ తమ సిఫార్సుల్లో 24 శాతం ఫిట్మెంట్ గా పేర్కొనట్లుగా తెలుస్తోంది. ఫిట్మెంట్ను వెంటనే అమలు చేస్తారా లేక 2020 మార్చి దాకా ఐఆర్ ఇచ్చి, బడ్జెట్ అనంతరం ఫిట్మెంట్ను అమల్లోకి తెస్తారా అన్నది ఆ సమావేశంలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి దీని పైన తుది నిర్ణయం తీసుకోనున్నారు.
పీఆర్సీ బకాయిలు..24 వాయిదాల్లో..
రాష్ట్రంలో 3.80 లక్షల మంది దాకా ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఉన్నారు. ఇక పెన్షనర్లు 2.5 లక్షల మంది. ఒక్క శాతం ఫిట్మెంట్ అమలు చేస్తే ఏడాదికి రూ.250 కోట్లు కావాలని ఆర్థిక శాఖ లెక్కకట్టింది. 24 శాతం ఫిట్మెంట్ ఇస్తే రూ.6000 కోట్ల దాకా ఖర్చవనుంది. వేతన బకాయిలు కూడా రూ.6000 కోట్లు కానున్నాయి. ప్రభుత్వం గతంలో 18 వాయిదాల్లో పీఆర్సీ బకాయిలను చెల్లించగా.. ఈసారి 24 వాయిదాలు తీసుకునే అవకాశం ఉంది. పెరిగిన వేతనాలన్నీ 1న చెల్లిస్తే.. బకాయిలు మాత్రం 15న లేదా 25లోపు జమ చేసే అవకాశాలున్నాయి. పీఆర్సీ గడువు 2018 జూన్తో ముగిసింది. కొత్త పీఆర్సీని 2018 జూలై నుంచి అమల్లోకి తేవాల్సి ఉంది. కాగా, పీఆర్సీ వచ్చే ఏడాది మరో నివేదిక ఇచ్చే అవకాశాలున్నాయి.
పదవీ విరమణ వయసు పైనా..
పీఆర్సీ సిఫార్సుల అమలు పైన ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్యోగ సంఘాలతో ఈ నెల 22న సమావేశం కావాలని నిర్ణయించారు. అదే సమావేశంలో పీఆర్సీ సిఫార్సులును ఉద్యోగ సంఘాల నేతల ముందు ఉంచి వారితో ఫిట్మెంట్ పైన తుది నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది. అదే సమయంలో ఉద్యోగుల సమస్యల పైనా చర్చించనున్నారు. ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంపుపైనా విధాన నిర్ణయం తీసుకోనున్నారు. రెండేళ్ల దాకా పెంచుతామని ఇప్పటికే సీఎం ప్రకటన చేశారు. దీనికి అనుగుణంగానే నిర్ణయం తీసుకొని డిసెంబరు 1 నుంచి పదవీ విరమణ వయసు పెంచేలా ఉత్తర్వులు ఇచ్చే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. ఈనెల 18న పీఆర్సీతో ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి రామకృష్ణారావు మరోసారి భేటీ కానున్నారు.