ఎట్టకేలకు వ్యూహం మార్చిన కేసీఆర్... 'కరోనా'పై నయా యాక్షన్ ప్లాన్ ఇదే...
కరోనా టెస్టుల విషయంలో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న తెలంగాణ సర్కార్.. ఇక వాటికి చెక్ పెట్టే పనిలో పడింది. హైకోర్టు అక్షింతలతో ఆలోచనలో పడ్డ ప్రభుత్వం యుద్దప్రాతిపదికన టెస్టుల సంఖ్యను పెంచే ఆలోచన చేసింది. ఇందులో భాగంగా రాష్ట్రంలో 7లక్షల యాంటీజెన్ టెస్టులు నిర్వహించాలని నిర్ణయించింది. తొలి దశలో 2లక్షల యాంటీజెన్ టెస్టు కిట్లు తెప్పించిన ప్రభుత్వం...వాటితో ఇప్పటికే 65వేల టెస్టులు నిర్వహించింది. ఆ తర్వాత రెండో దశలో 3లక్షల కిట్లు,తాజాగా మరో 2 లక్షల కిట్లను తెప్పించేందుకు ప్రభుత్వం సిద్దమైంది.మొత్తం 7లక్షల కిట్లతో రాష్ట్రవ్యాప్తంగా టెస్టులు నిర్వహించాలని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారులకు ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. ఇప్పటికే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల (పీహెచ్సీ)లో కరోనా టెస్టులు ప్రారంభమయ్యాయని అధికారులు చెబుతున్నారు.
Recommended Video

ఆర్టీపీసీఆర్కు బదులు యాంటీజెన్...
ప్రస్తుతం చేపడుతున్న ఆర్టీపీసీఆర్ టెస్టులకు ఎక్కువ సమయం పడుతోంది. ఫలితాల కోసం కనీసం 2,3 రోజులు ఎదురుచూడాల్సి వస్తోంది. దీంతో వైరస్ సోకినవారిని వెంటనే గుర్తించి ఐసోలేషన్ చేసేందుకు అవకాశం ఉండట్లేదు.అదే యాంటీజెన్ టెస్టులు నిర్వహించినట్లయితే... కేవలం అరగంటలోనే ఫలితాలు వస్తాయి. దీంతో కరోనా సోకిన వారిని వెంటనే గుర్తించి, ఐసోలేషన్ చేసేందుకు వీలు కలుగుతుంది. అందుకే ఆర్టీపీసీఆర్ స్థానం లో యాంటిజెన్ టెస్టులను విస్తృతంగా చేయనున్నారు. ప్రస్తుతం రోజుకు సగటున 13-14 వేల టెస్టులు చేస్తున్నారు. వీటిలో 90 శాతం మేరకు యాంటిజెన్ పరీక్షలే ఉంటున్నాయి.

ప్రైవేట్కూ అనుమతి...
యాంటీజెన్ పరీక్షలు నిర్వహించేందుకు ప్రైవేట్ ఆస్ప్రత్రులకు కూడా అనుమతివ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇదివరకే ఐసీఎంఆర్ ఇందుకు అనుమతులివ్వడంతో ప్రభుత్వం కూడా అందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. కరోనా నేపథ్యంలో అత్యవసర సర్జరీలకు ముందు యాంటీజెన్ టెస్టులు తప్పనిసరిగా చేయాల్సి ఉండటంతో ప్రభుత్వం ఇందుకు అంగీకారం తెలిపినట్లు సమాచారం. అయితే ప్రైవేట్లో యాంటీజెన్ టెస్టులకు సంబంధించిన డేటాను ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి చేరవేయాల్సి ఉంటుంది.

జ్వరం వచ్చిన ప్రతీ ఒక్కరికీ...
రాష్ట్రంలో 7లక్షల యాంటీజెన్ కిట్లతో టెస్టులు నిర్వహించేందుకు అంతా సిద్దమవడంతో... జ్వరం వచ్చిన ప్రతీ ఒక్కరికీ పరీక్షలు నిర్వహించాలని వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ఆశ కార్యకర్తలు, ఏఎన్ఎంలను ఆదేశించారు. జ్వరం వచ్చినవాళ్లలో ఎవరికైనా కరోనా పాజిటివ్గా తేలితే... త్వరగా వారిని ఐసోలేషన్ చేయడం ద్వారా వైరస్ వ్యాప్తిని అడ్డుకోవడంతో పాటు వారి ప్రాణాలను కాపాడవచ్చునని ప్రభుత్వం యోచిస్తోంది.

వ్యూహాం మార్చిన సర్కార్...
నిజానికి టెస్టుల విషయంలో తెలంగాణ ప్రభుత్వం తొలి నుంచి తాత్సారం చేస్తూనే వచ్చింది. ఎన్ని విమర్శలు వచ్చినా... తాము ఐసీఎంఆర్ మార్గదర్శకాలనే పాటిస్తున్నామని ,టెస్టులు చేయట్లేదనడం సరికాదని చెబుతూ వచ్చింది.అంతేకాదు,టెస్టుల సంఖ్యను పెంచడం వల్ల పెద్దగా ఉపయోగం కూడా ఉండదని అభిప్రాయపడింది. కానీ ఎట్టకేలకు ప్రభుత్వం తన వ్యూహాన్ని మార్చుకోక తప్పలేదు. టెస్టుల విషయంలో హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో... విస్తృతంగా టెస్టులు నిర్వహించాలని నిర్ణయించింది. ప్రస్తుతం రోజుకు సగటున 13వేల నుంచి 14వేల టెస్టులు చేస్తుండగా.. రాబోయే రోజుల్లో ఈ సంఖ్యను రెట్టింపు చేసే ఆలోచనలో ఉంది సర్కార్.












Click it and Unblock the Notifications