ఆర్టీసీ సమ్మె వేళ ప్రయాణీకులకు ఊరట, ప్రభుత్వం తాజా నిర్ణయంతో..!!
తెలంగాణలో ఆర్టీసీ సమ్మె మొదలైంది. అన్ని డిపోల్లో బస్సులు నిలిచిపోయాయి. ఆర్టీసీ కార్మికుల నిరసనలు హోరెత్తుతున్నాయి. తమ డిమాండ్లు పరిష్కరించే వరకూ సమ్మె విరమించేది లేదని ఆర్టీసీ జేఏసీ తేల్చి చెప్పింది. సమ్మె నేపథ్యంలో ప్రభుత్వం ప్రత్యామ్నాయ చర్యల పైన ఫోకస్ చేసింది. హైదరాబాద్ నగరంలో ప్రయివేటు సర్వీసులను అందుబాటులో ఉంచింది. సమ్మె వేళ క్యాబ్ లలో.. ఆటోలు ఇష్టానుసారం వసూలు చేస్తున్నారు. ఇదే సమయంలో ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇదే ఇప్పుడు ప్రయాణీకులకు కొంత రిలీఫ్ గా కనిపిస్తోంది.
తెలంగాణ వ్యాప్తంగా టీజీఎస్ ఆర్టీసీ బస్సులు నిలిచిపోయాయి. సమస్యలు పరిష్కరించాలంటూ ప్రభుత్వంతో నిన్న(మంగళవారం) జరిగిన చర్చలు విఫలం కావడంతో అర్ధరాత్రి నుంచే బస్సులను నిలిపివేశారు.దీంతో బస్సులన్నీ డిపోలకే పరిమితం అయ్యాయి. ఆర్టీసీ బస్సులు నడవకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విద్యార్థులు, ఉద్యోగులు, సాధారణ ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. సమస్యల పరిష్కారానికి అధికారులు 4 వారాల సమయం కోరగా, దీనిని జేఏసీ ఖరాఖండిగా తిరస్కరించింది. ప్రభుత్వం 'ఎస్మా' ప్రయోగించి తమను భయపెట్టాలని చూస్తోందని, అయితే ఎటువంటి బెదిరింపులకు లొంగబోమని కార్మిక సంఘాలు తేల్చిచెప్పాయి. డిమాండ్లు నెరవేరే వరకు సమ్మె విరమించే ప్రసక్తే లేదని వారు స్పష్టం చేస్తున్నారు. ఇదే సమయంలో ప్రభుత్వం ఈ రోజు మరోసారి కార్మిక సంఘాలతో చర్చల కు సిద్దం అవుతోంది. కాగా.. ప్రత్యామ్నాయ చర్యల పైనా ప్రభుత్వం ఫోకస్ చేసింది.

ఆర్టీసీ జేఏసీతో ప్రభుత్వం మరోసారి చర్చలు
హైదరాబాద్ నగరంలో ఎక్కువగా ఆర్టీసీ సర్వీసుల్లో ప్రయాణం పైనే ఆధారపడతారు. దీంతో, అటు మెట్రో, ఎంఎంటీస్ సర్వీసుల పైన ప్రభుత్వం ఫోకస్ చేసింది. సర్వీసులను పెంచాలని తాజాగా సూచనలు చేసింది. అదే విధంగా సెట్విన్ బస్సులను రోడ్ల పైకి తీసుకొచ్చింది. ప్రయివేటు రవాణా వాహనాలను అందుబాటులోకి తీసుకొస్తోంది. ఏపీఎస్ ఆర్టీసీకి చెందిన బస్సులు రాకపోకలు యధా విధిగా కొనసాగుతున్నాయి. వేసవి సెలవుల్లో ఇతర ప్రాంతాలకు వెళ్లే వారికి సమస్యలు మొదలు అయ్యాయి. ఏపీ జిల్లాలకు వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడుపుతోంది. కాగా.. ఉద్యోగుల డిమాండ్లలో కీలకంగా ఉన్న ఐఆర్ పైన ప్రభుత్వం సానుకూలంగా ఉందని తెలుస్తోంది. అందులో భాగంగా ముందుగా ఐఆర్ ఎంత శాతం ప్రకటిస్తే.. సమస్య పరిష్కారం అవుతుందనే అంచనాల పైన కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ఈ సాయంత్రం మరోసారి ఆర్టీసీ కార్మిక సంఘా లతో ప్రభుత్వం చర్చలు చేసే అవకాశం ఉంది. ఈ చర్చల్లో సానుకూల ఫలితం రాకపోతే.. ఈ సమ్మె మరింత తీవ్ర రూపం దాల్చే అవకాశం ఉందని భావిస్తున్నారు.













Click it and Unblock the Notifications