"కల్యాణలక్ష్మి" అమల్లో కీలక మార్పులు, ఇక నుంచి - మార్గదర్శకాలు..!!
తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల అమల్లో కీలక మార్పులకు సిద్ధమవుతోంది. ఈ మేరకు కొత్త ప్రతిపాదనలు సిద్దం అయ్యాయి. ఈ పథకం కింద ఇక నుంచి చెక్కులు కాకుండా నేరుగా అర్హత ఉన్న లబ్దిదారుల ఖాతాల్లో ప్రత్యక్ష నగదు బదిలీ పథకం కింద నిధులు జమ చేయాలని భావిస్తున్నారు. లబ్దిదారుల ఎంపిక.. ఆమోదం కోసం కొత్త విధానం అందుబాటులోకి తీసుకురానుంది.
తెలంగాణ ప్రభుత్వం కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల అమల్లో కొత్త విధానం అమలు చేసేందుకు సిద్దం అవుతోంది. ఇప్పటి వరకు ఈ పథకాల కింద లబ్దిదారులకు చెక్కుల రూపంలో అందిస్తున్న రూ.1,00,116 ఆర్థిక సాయాన్ని ఇకపై నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసే ఆలోచన చేస్తోంది. ఈ రెండు పథకాలకు డీబీటీ విధానాన్ని తీసుకురావాలని ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. లబ్దిదారులు తమ దరఖాస్తు ఆన్ లైన్ లో చేసేందుకు వీలుగా కొత్త పోర్టల్ ను తీసుకొస్తోంది. అదే విధంగా ఆమోద ప్రక్రియను ఆన్ లైన్ విధానంలోనూ పూర్తి చేయనుంది. దీని ద్వారా ప్రభుత్వం నిర్దేశించిన అర్హతలు ఉన్న లబ్దిదారులకు వగంగా పథకం నిధులు జమ అయ్యే విధంగా మార్పులు తీసుకొస్తోంది. ప్రస్తుతం ఎమ్మార్వో, ఆర్డీవో స్థాయిలో వెరిఫికేషన్ ఆలస్యం కావడంతో వేలాది దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి.

ప్రభుత్వం తుది కసరత్తు
దీంతో, ఆన్ లైన్ విధానంతో పాటుగా డీబీటి ద్వారా లబ్ధిదారులకు త్వరగా సాయం అందే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో ఏడాదికిపైగా దరఖాస్తులు పెండింగ్లోనే ఉంటున్నాయి. ఎమ్మార్వో, ఆర్డీవోలకు రోజువారీ బాధ్యతలు, సంక్షేమ పథకాల వ్యవహారాలతోపాటు జనగణన, ఓటర్ల జాబితాల సమగ్ర సవరణ (సర్) వంటి బాధ్యతలూ మీదపడటంతో పని ఒత్తిడి పెరిగిపోతోందని.. పథకాల అమలు పైన సమయం కేటాయించే అవకాశం ఉండటం లేదని చెబుతున్నారు. దీంతో, ఇక నుంచి చెక్కుల విధానంలో కాకుండా లబ్ధిదారుల ఖాతాలోనే నేరుగా సాయాన్ని జమ చేయాలని (డీబీటీ) ప్రభుత్వం భావిస్తున్నట్టు సమాచారం. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన చేసేందుకు తుది కసరత్తు జరుగుతోంది.












Click it and Unblock the Notifications