తెలంగాణ గ్లోబల్ టెండర్లు: 10 మిలియన్ డోసుల వ్యాక్సిన్: కండీషన్స్ ఇవే
హైదరాబాద్: ప్రాణాంతక కరోనా వైరస్ నిర్మూలించడానికి ఉద్దేశించిన వ్యాక్సిన్ల కొరతను ఎదుర్కొంటోన్న తెలంగాణ ప్రభుత్వం.. దీన్ని అధిగమించడానికి గ్లోబల్ టెండర్లను ఆశ్రయించింది. మొత్తం 10 మిలియన్ డోసుల వ్యాక్సిన్లను సేకరించడానికి గ్లోబల్ టెండర్లను ఆహ్వానించింది. దీనికి సంబంధించిన టెండర్ల ప్రక్రియను ప్రారంభించింది. ఆన్లైన్ ద్వారా బిడ్ల దాఖలు చేయడానికి వచ్చేనెల 4వ తేదీని చివరిగడువుగా నిర్ధారించింది. ఇందులో కొన్ని షరతులను కూడా విధించింది ప్రభుత్వం. ఆరు నెలల్లోగా 10 మిలియన్ డోసుల వ్యాక్సిన్లను సరఫరా చేయాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.
ప్రభుత్వం విడుదల చేస్తోన్న రోజువారీ బులెటిన్ ప్రకారం.. తెలంగాణలో కరోనా వైరస్ తీవ్రత ఇతర రాష్ట్రాల కంటే తక్కువే. మంగళవారం సాయంత్రం నాటి బులెటిన్ ప్రకారం.. 24 గంటల వ్యవధిలో కొత్తగా 3,982 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 5,186 మంది డిశ్చార్జ్ అయ్యారు. 27 మంది మృత్యువాత పడ్డారు. ఇప్పటిదాకా నమోదైన మొత్తం కేసులు 5,36,766కు చేరుకున్నాయి. ఇందులో 4,85,644 మంది డిశ్చార్జ్ అయ్యారు. 3,012 మంది మృత్యువాత పడ్డారు. యాక్టివ్ కేసులు 48,110గా రికార్డయ్యాయి.

దీన్ని మరింత నియంత్రించడానికి కేసీఆర్ సర్కార్ యుద్ధ ప్రాతిపదికన చర్యలను తీసుకుంటోంది. రెండు దశల వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని కొనసాగిస్తోంది. వ్యాక్సిన్ల కొరత కారణంగా18 నుంచి 45 సంవత్సరాల్లోపు వయస్సు ఉన్న వారికి ఇవ్వడానికి ఉద్దేశించిన మూడోదశ టీకా కార్యక్రమాన్ని ఇంకా చేపట్టలేదు. అదే సమయంలో 45 సంవత్సరాలకు పైగా వయస్సున్న వారికి ఇవ్వాల్సిన రెండో డోసు వ్యాక్సిన్ను కూడా నిలిపివేసింది. తాత్కాలికంగా వాయిదా వేసింది.
ఈ పరిస్థితుల్లో వ్యాక్సిన్లను సేకరించడానికి గ్లోబల్ టెండర్లను ఆహ్వానించకతప్పదని నిర్ణయించిన కేసీఆర్ సర్కార్.. దీన్ని కార్యాచరణలోకి తీసుకొచ్చింది. ఈ ఉదయం గ్లోబల్ టెండర్లను ఆహ్వానించింది. ఈ మేరకు షార్ట్ టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. గ్లోబల్ టెండర్ల ద్వారా 10 మిలియన్ డోసుల వ్యాక్సిన్ను ప్రభుత్వం సేకరించనుంది. బిడ్డింగ్ పత్రాలను శుక్రవారం వెబ్సైట్లో పొందుపరచనున్నట్లు తెలిపింది. ఆరు నెలల్లోపల 10 మిలియన్ డోసుల వ్యాక్సిన్ను సరఫరా చేయాలని ప్రభుత్వం నిబంధన విధించింది.
అలాగే- వ్యాక్సిన్లను సరఫరా చేయదలిచిన వారు ప్రతినెలా ఒకటిన్నర మిలియన్ డోసులను తప్పనిసరిగా అందజేచేయాల్సి ఉంటుందని సూచించింది. రాష్ర్టంలో మొత్తం 4 కోట్ల మందికి వ్యాక్సిన్ను ఇవ్వాలని ఇప్పటికే రాష్ర్ట ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇటీవలే ఏర్పాటైన మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు కేసీఆర్ సర్కార్ ఈ నిర్ణయాన్ని తీసుకుంది. కాగా- ఏపీ ప్రభుత్వం కూడా వ్యాక్సిన్లను సేకరించడానికి గ్లోబల్ టెండర్లకు వెళ్లాలని నిర్ణయించుకుంది. బిడ్డింగుల ప్రక్రియను ఇంకా ఆరంభించలేదు.












Click it and Unblock the Notifications