సచివాలయం కూల్చివేత... రేపటి లోగా దానిపై తేల్చాల్సిందేనన్న హైకోర్టు...
సచివాలయ కూల్చివేతలపై గోప్యతకు సంబంధించి దాఖలైన పిటిషన్పై హైకోర్టు గురువారం(జూలై 23) విచారణ చేపట్టింది. సెక్షన్ 180ఈ ప్రకారం సైట్లో పని చేసేవారు మాత్రమే కూల్చివేతల ప్రదేశంలో ఉండాలని... వారిని తప్ప ఇంకెవరీనీ అక్కడికి అనుమతించేది లేదని ఈ సందర్భంగా ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. అయితే అంత గోపత్య ఎందుకు పాటిస్తున్నారని హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.
కోవిడ్ 19కి సంబంధించి ఎలాగైతే బులెటిన్లను విడుదల చేస్తున్నారో... సచివాలయ కూల్చివేతలపై కూడా బులెటిన్ విడుదల చేయవచ్చు కదా అని ప్రభుత్వానికి సూచించింది. దీనిపై ప్రభుత్వాన్ని సంప్రదించి సోమవారం కోర్టుకు వివరాలు అందిస్తామని అడ్వకేట్ జనరల్ తెలిపారు. అయితే కోర్టు మాత్రం రేపటి(శుక్రవారం,జూలై 24) లోగా దీనిపై ప్రభుత్వం తమ నిర్ణయాన్ని చెప్పాలని... లేనిపక్షంలో తామే ఆదేశాలు ఇవ్వాల్సి వస్తుందని వ్యాఖ్యానించింది. తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది.
గురువారం కూడా హైకోర్టులో ఇదే అంశంపై విచారణ జరిగిన సంగతి తెలిసిందే. సచివాలయం కూల్చివేత కవరేజీపై ప్రభుత్వం ఆంక్షలు విధించిందని, భవనాల కూల్చివేతలో ప్రభుత్వం గోప్యత పాటిస్తుందని పిటిషనర్ పేర్కొన్నారు. ప్రజలకు అసలు ఏం జరుగుతుందో తెలియాల్సిన అవసరం ఉందని అన్నారు. అయితే కూల్చివేతల వద్ద ప్రమాదాలకు అవకాశం ఉండటంతో ఎవరికీ అనుమతి ఇవ్వట్లేదని ప్రభుత్వం వివరణ ఇచ్చింది. కానీ కోర్టు మాత్రం ఆ వాదనతో విబేధించింది. యుద్ద రంగంలోనూ మీడియాకు అనుమతినిస్తున్నారని... అలాంటప్పుడు కూల్చివేతలపై మాత్రం ఆంక్షలు ఎందుకని ప్రశ్నించింది.
మరోవైపు ముఖ్యమంత్రి కేసీఆర్ కొత్త సచివాలయ నిర్మాణంపై ఇప్పటికే పలుమార్లు సమీక్షా సమావేశాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. రాష్ట్ర ప్రతిష్టను ఇనుమడింపజేసేలా,తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా సచివాలయం ఉంటుందని అన్నారు. గతంలో మాదిరిగా అక్కడొకరు,ఇక్కడొకరు కాకుండా... సీఎం,మంత్రులు,సీఎస్ ఒకే చోట విధులు నిర్వర్తించేలా అన్ని సదుపాయాలు ఉంటాయన్నారు. ప్రభుత్వ యంత్రాంగమంతా ఒకే దగ్గర ఉండేలా సచివాలయాన్నీ నిర్మిస్తున్నట్లు తెలిపారు.