ఇందిరమ్మ ఇళ్ళ రెండో దశపై కీలక అప్డేట్ ఇచ్చిన మంత్రి పొంగులేటి
తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ళ పథకం విషయంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి శుభవార్త చెప్పారు. పేదలందరికీ సొంతింటి కలను నిజం చేసే ఇందిరమ్మ ఇళ్ల పథకం రెండో దశను రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూన్ 2న ఆదిలాబాద్లో ప్రారంభించనున్నట్లు రెవెన్యూ, హౌసింగ్ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు.
ఇందిరమ్మ ఇళ్ళ పథకం రెండో దశ అమలుపై చర్చ
ఇందిరమ్మ ఇళ్ళ పథకం రెండో దశ అమలు విధానాలను ఈ నెల 21న జరిగే మంత్రివర్గ సమావేశంలో చర్చించి అంతిమ రూపం ఇవ్వనున్నామని ఆయన తెలిపారు. హైదరాబాద్లోని హౌసింగ్ కార్పొరేషన్ కార్యాలయంలో మంగళవారం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధ్యక్షతన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో స్పీకర్ ప్రసాద్ కుమార్, మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, మహమ్మద్ అజారుద్దీన్, శాసనమండలి చీఫ్ విప్ మహేందర్ రెడ్డి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

హైదరాబాద్ లో ఆ ప్రాంతాలలో ఇందిరమ్మ ఇళ్ళు
మంత్రి పొంగులేటి మాట్లాడుతూ, గత ప్రభుత్వం హైదరాబాద్కు 20-30 కిలోమీటర్ల దూరంలో ఇళ్లు నిర్మించి నగరంలో ఉపాధి ఉన్న పేదలకు కేటాయించడం వల్ల లబ్ధిదారులు ఆ ఇళ్లలో ఉండటానికి నిరాకరిస్తున్నారని, క్షేత్రస్థాయి సమస్యలు తెలిసినట్లు పేర్కొన్నారు. ఈ తప్పిదాన్ని పునరావృతం చేయకుండా, ప్రస్తుతం పేదలు నివసిస్తున్న ప్రాంతాల నుంచి 5-8 కిలోమీటర్ల పరిధిలోనే ఇందిరమ్మ ఇళ్లను నిర్మించి అందజేస్తామని స్పష్టం చేశారు.
ప్రజా ప్రతినిధులను భాగస్వాములను చేసేలా ప్రతిపాదనలు
రాష్ట్రంలో నియోజకవర్గాలను యూనిట్గా తీసుకొని ప్రభుత్వ భూములు, భూదాన భూములు, మురికివాడలు, పాత ఇళ్లు శిథిలమైన ప్రాంతాలను గుర్తించాలని అధికారులను ఆదేశించారు. ఇళ్ల ప్రతిపాదనలు రూపొందించేటప్పుడు ప్రజా ప్రతినిధులను పూర్తి స్థాయిలో భాగస్వాములను చేయాలని సూచించారు.హైదరాబాద్ పరిధిలో సొంత స్థలం ఉన్న అర్హులందరికీ ఈ నెలాఖరులోగా ఇందిరమ్మ ఇళ్ల మంజూరు చేయాలని మంత్రి ఆదేశాలు ఇచ్చారు.
ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక కోసం ప్రత్యేక డ్రైవ్
రెండు పడకగదుల ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక కోసం ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి, వారి ప్రస్తుత నివాసాలకు సమీపంలోనే ఇళ్లు కేటాయించాలని తెలిపారు.మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ, పేదరికమే ఏకైక అర్హతగా లబ్ధిదారులను ఎంపిక చేయాలని, ఎలాంటి రాజకీయ ప్రమేయాలకు తావు లేదని స్పష్టం చేశారు.













Click it and Unblock the Notifications