హైదరాబాద్లో అక్కడే వినాయక విగ్రహాల నిమజ్జనానికి గ్రీన్ సిగ్నల్..!!
Ganesh Idol: హైదరాబాద్లో వినాయక చవితి పండగ కోలాహలం కొనసాగుతోంది. ప్రతి వీధిలో విఘ్న నాయకుడు కొలువుదీరాడు. జంటనగరాల్లో వాడవాడలా గణేషుడి మండపాలు వెలిశాయి. గణపతి బప్పా మోరియా నినాదాలతో మార్మోగుతున్నాయి.
రెండు తెలుగు రాష్ట్రాల్లో అతి ఎత్తయిన ఖైరతాబాద్ గణేషుడి విగ్రహం వద్ద జాతర తరహా వాతావరణం ఏర్పడింది. వేలాదిమంది భక్తులు వినాయకుడిని దర్శించుకోవడానికి బారులు తీరుతున్నారు. ఉదయం, సాయంత్రం వేళల్లో రద్దీ అధికంగా ఉంటోంది. వినాయకుడిని దర్శించడానికి పెద్ద ఎత్తున భక్తులు ఖైరతాబాద్కు చేరుకుంటోన్నారు.

ఈ నెల 17వ తేదీన అనంత చతుర్థశిని పురస్కరించుకుని గణేషుడి విగ్రహాల నిమజ్జనం జరుగనుంది. ప్రతి సంవత్సరం కన్నుల పండువగా ఈ కార్యక్రమం కొనసాగుతుంటుంది. గణేషుడి విగ్రహాలన్నింటినీ కూడా హుస్సేన్ సాగర్లో నిమజ్జనం చేయడం ఆనవాయితీగా వస్తోంది.
దీన్ని తిలకించడానికి లక్షలాది మంది భక్తులు హైదరాబాద్కు వస్తుంటారు. ట్యాంక్ బండ్, నెక్లెస్ రోడ్ను అధికారులు మూసివేస్తుంటారు. ఈ మార్గంలో వాహనాలన్నింటినీ దారి మళ్లిస్తుంటారు. వినాయక విగ్రహాల నిమజ్జనోత్సవం, ఊరేగింపు సజావుగా సాగేలా ముందస్తు ఏర్పాట్లు చేస్తుంటారు.
ఈ సారి మాత్రం అలాంటి వాతావరణం ఉండకపోవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమౌతోన్నాయి. దీనికి కారణాలు లేకపోలేదు. హుస్సేన్ సాగర్లో వినాయక విగ్రహాల నిమజ్జనంపై గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు, నగర పోలీసులు నిషేధం విధించారు. ఈ మేరకు ట్యాంక్ బండ్ వద్ద బ్యానర్ను కట్టారు.
హైకోర్టు ఆదేశాల మేరకు హుస్సేన్ సాగర్లో వినాయక విగ్రహాల నిమజ్జనాన్ని నిషేధించినట్లు ఈ బ్యానర్లో స్పష్టంగా వివరించారు. ఫలితంగా ఖైరతాబాద్ సహా వినాయకుడి విగ్రహాలేవీ కూడా ఈ ఏడాది హుస్సేన్ సాగర్లో నిమజ్జనం లేనట్టేననే అభిప్రాయాలు వినిపిస్తోన్నాయి.
ఆ తరువాత నాటకీయ పరిణామాలు సంభవించాయి. ట్యాంక్బండ్పై గణేషుడి విగ్రహాలను నిమజ్జనం చేయడానికి హైకోర్టు అంగీకారం తెలిపింది. హుస్సేన్ సాగర్లో నిమజ్జనానికి వ్యతిరేకంగా దాఖలైన పిటీషన్లపై విచారణను హైకోర్టు తిరస్కరించింది. అధికారులు కోర్టు ధిక్కారణకు పాల్పడినట్లు పిటీషనర్ తరఫు న్యాయవాది తగిన సాక్ష్యాధారాలను సమర్పించలేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకుంది.
నిమజ్జనం విషయంలో గతంలో ఇచ్చిన ఆదేశాలు, మార్గదర్శకాలు, నియమ నిబంధనలను తప్పకుండా పాటించాల్సి ఉంటుందని హైకోర్టు అధికార యంత్రాంగాన్ని సూచించింది. ఒకవంక నిమజ్జనం పనులు, దీనికి సంబంధించిన ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఇలాంటి పిటీషన్లు దాఖలు కావడం సరికాదని అభిప్రాయపడింది.












Click it and Unblock the Notifications