తెలంగాణలో జర్నలిస్టుల రోధన అరణ్య రోధనే... సీఎం కేసీఆర్కు బహిరంగ లేఖ... ఇవీ డిమాండ్లు...
తెలంగాణలోని సీనియర్ జర్నలిస్టులు ముఖ్యమంత్రి కేసీఆర్కు బహిరంగ లేఖ రాశారు. కరోనా పరిస్థితుల్లో జర్నలిస్టులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ఫ్రంట్ లైన్ వారియర్స్గా పనిచేస్తున్న జర్నలిస్టులను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని గుర్తుచేశారు. ప్రభుత్వం చేపట్టిన కరోనా కట్టడి చర్యల్లో జర్నలిస్టులు తమవంతు కృషి చేస్తున్నారని, విధి నిర్వహణలో చాలా మంది కరోనా బారిన పడ్డారని, పదుల సంఖ్యలో మృతి చెందారని ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం(మే 4) హైదరాబాద్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు మీడియా సమావేశంలో పలువురు సీనియర్ జర్నలిస్టులు మాట్లాడారు.
కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయితే వైద్య చికిత్సకు కూడా నోచుకోని స్థితిలో చాలామంది ఉన్నారని వాపోయారు.ప్రైవేట్ ఆస్పత్రుల్లో హెల్త్ కార్డుపై చికిత్స కూడా అందడం లేదన్నారు. కరోనా ఫస్ట్ వేవ్లోనే వందలాది జర్నలిస్టులను యాజమాన్యాలు క్రాస్ కటింగ్ పేరుతో ఉద్యోగాల నుంచి తొలగించాయని పేర్కొన్నారు. దీంతో చాలామంది జర్నలిస్టులు రోడ్డునపడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. కొన్ని సంస్థలు జీతాల్లో కోత విధించాయని ఇలాంటి పరిస్థితుల్లో కరోనా బారిన పడితే ఇక చావే శరణ్యమనే పరిస్థితి దాపురించిందని వాపోయారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన జర్నలిస్టులు స్వరాష్ట్రంలో దిక్కులేని వారిగా మిగిలిపోవడం శోచనీయం అన్నారు. జర్నలిస్టుల రోధన అరణ్య రోధనే అయిందన్నారు.
నాడు తెలంగాణ ఉద్యమంలోనూ, నేడు రాష్ట్ర నిర్మాణంలోనూ జర్నలిస్టులు ముందు వరుసలో నిలిచారని చెప్పారు. తమిళనాడు, ఢిల్లీ, కర్ణాటక సహా పలు రాష్ట్రాల ప్రభుత్వాలు ఇప్పటికే జర్నలిస్టులను ఫ్రంట్ లైన్ వారియర్స్గా గుర్తించాయన్నారు. కానీ తెలంగాణ ప్రభుత్వం మాత్రం జర్నలిస్టులను గుర్తించకపోవడం శోచనీయమన్నారు. ఇప్పటికైనా సీఎం కేసీఆర్ జర్నలిస్టుల సమస్యలపై దృష్టి సారించాలని విజ్ఞప్తి చేశారు. జర్నలిస్టులను ఫ్రంట్ లైన్ వారియర్స్ గా గుర్తించడంతో పాటు మృతి చెందిన జర్నలిస్టుల కుటుంబాలకు రూ.25లక్షల ఆర్ధికసాయం అందించాలన్నారు. కరోనాతో హోం ఐసోలేషన్లో చికిత్స పొందుతున్న జర్నలిస్టులకు రూ.25వేలు ఆర్థికసాయంతో పాటు అన్ని కార్పోరేట్, ప్రైవేటు ఆసుపత్రుల్లో హెల్త్ కార్డుతో ఉచిత చికిత్స అందజేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సతీష్ కమల్, జయసారథి రెడ్డి, ఎన్. విశ్వనాథ్, అయోధ్య రెడ్డి, బి. వేణు, పల్లె రవికుమార్, ఎంఎన్ స్వామి తదితరులు పాల్గొన్నారు.