ఇంటర్మీడియట్ పరీక్షలపై తేల్చేసిన తెలంగాణ ప్రభుత్వం: ఇక జగన్ సర్కార్పై మరింత ఒత్తిడి
హైదరాబాద్: కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం పరీక్షల నిర్వహణపై తెలంగాణ ప్రభుత్వం తేల్చేసింది. తన వైఖరిని స్పష్టం చేసింది. ఇంటర్ పరీక్షలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు విద్యామంత్రిత్వ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. పరీక్షలను నిర్వహించడానికి అనుకూల వాతావరణం రాష్ట్రంలో లేదని అభిప్రాయపడింది. ఇంటర్మీడియట్ పరీక్షలను రద్దు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం.. ఏపీ ప్రభుత్వంపై ఒత్తిడిని పెంచినట్టయింది.
Recommended Video
సుమారు నెలరోజులుగా తెలంగాణ లాక్డౌన్లో ఉంటోంది. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలపై దీని ప్రభావం పడింది. ఇంటర్మీడియట్ పరీక్షలకు సిద్ధమౌతోన్న విద్యార్థుల కుటుంబాలు సైతం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటోన్నాయనే విషయం తమ దృష్టికి వచ్చిందని విద్యాశాఖ పేర్కొంది. అలాగే- కరోనా వైరస్ కేసులు ఇప్పుడిప్పుడే నియంత్రణలోకి వస్తోన్నాయని. అదే సమయంలో మళ్లీ పరీక్షలను నిర్వహించాల్సి వస్తే.. పరిస్థితి మళ్లీ మొదటికొచ్చే వాతావరణం లేకపోలేదని భావిస్తున్నట్లు తెలిపింది.
దీన్నంతటినీ పరిగణనలోకి తీసుకుని పరీక్షలను రద్దు చేయాలని నిర్ణయించినట్లు స్పష్టం చేసింది. ఇప్పటికే ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు రద్దయ్యాయి. అంతకుముందే పదో తరగతి పరీక్షలను కూడా ప్రభుత్వం రద్దు చేసింది. తాజా నిర్ణయంతో ఇంటర్మీడియట్ రెండేళ్ల పరీక్షలు కూడా రద్దు చేసినట్టయింది. ఇంటర్ తొలి ఏడాదిలో వచ్చిన మార్కులు, ప్రాక్టికల్స్, ఇంటర్నల్ అసెస్మెంట్ ద్వారా రెండో సంవత్సరానికి సంబంధించిన గ్రేడింగ్ ఇవ్వనున్నట్లు పేర్కొంది. షెడ్యూల్ ప్రకారం.. ఈ నెలలోనే ఇంటర్ సెకెండ్ ఇయర్ పరీక్షలను నిర్వహించాల్సి ఉన్నప్పటికీ.. కరోనా తీవ్రత తగ్గకపోవడం వల్ల రద్దు వైపే మొగ్గు చూపింది కేసీఆర్ సర్కార్.
తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం.. పరోక్షంగా ఏపీ ప్రభుత్వంపై ఒత్తిడిని తీసుకొచ్చినట్టయింది. ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణ విషయంలో జగన్ సర్కార్.. వెనక్కి తగ్గట్లేదు. పరీక్షలను నిర్వహించి తీరుతామని ప్రకటించింది. ఆ దిశగా చర్యలు కూడా తీసుకుంటోంది. ఆగస్టులో ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలను నిర్వహించడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఇంకా సుమారు రెండు నెలల పాటు సమయం ఉన్నందున.. ఈ లోగా కరోనా కేసుల తీవ్రత తగ్గుతుందని భావిస్తోంది జగన్ సర్కార్. పరీక్షలు ప్రారంభం కావడానికి 15 రోజుల తేదీని ప్రకటిస్తామని మంత్రి ఆదిమూలపు సురేష్ ఇప్పటికే స్పష్టం చేశారు కూడా.