మంత్రి గంగుల కమలాకర్, ఎంపీ రవిచంద్రను 8 గంటలపాటు విచారించిన సీబీఐ
న్యూఢిల్లీ: ఢిల్లీలో అరెస్టయిన నకిలీ సీబీఐ అధికారి శ్రీనివాసరావు కేసులో తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్, టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్రను సీబీఐ అధికారులు విచారించారు. సుమారు 8 గంటలపాటు వీరిని ప్రశ్నించారు. ఢిల్లీలోని సీబీఐ కేంద్ర కార్యాలయానికి మంత్రి గంగుల కమలాకర్, ఎంపీ వద్దిరాజు గురువారం మధ్యాహ్నం 12 గంటలకు చేరుకున్నారు.
విచారణలో శ్రీనివాస్తో ఉన్న సంబంధాలపై ఆరా తీశారు. అతడితో ఏయే అంశాలపై చర్చలు జరిపారని ప్రశ్నించారు. విచారణ అనంతరం గంగుల కమలాకర్, వద్దిరాజు అనంతరం మీడియాతో మాట్లాడారు. సీబీఐ అధికారులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పామని తెలిపారు. తమను మళ్లీ విచారణకు రావాలని సీబీఐ చెప్పలేదన్నారు.
తాము చెప్పిన అంశాలను రికార్డు చేసుకున్నారని చెప్పారు. సీబీఐ అధికారుల వద్ద ఉన్న సమాచారాన్ని, తాము ఇచ్చిన సమాచారాన్ని సరిపోల్చుకున్నారని తెలిపారు. నిందితుడు శ్రీనివాసరావును కూడా మా ముందుంచి పలు ప్రశ్నలు అడిగారని చెప్పారు. ఇదే చివరి విచారణ, మళ్లీ విచారణ అవసరం లేదని అధికారులు చెప్పారని వెల్లడించారు.

తాము ఇచ్చిన సమాధానాలతో సీబీఐ అధికారులు సంతృప్తి చెందారని గంగుల కమలాకర్ తెలిపారు. తమతో ఎలాంటి లావాదేవీలు జరపలేదని శ్రీనివాస్ అంగీకరించారని చెప్పారు. తాము ఇచ్చిన స్టేట్మెంట్పై సంతకాలు తీసుకున్నారని కమలాకర్ తెలిపారు. సీబీఐ అధికారులకు అన్ని అంశాలు వివరించామని, అన్ని విధాలా వారికి సహకరించామని వద్దిరాజు రవిచంద్ర తెలిపారు. శ్రీనివాసరావును కాపు సమ్మేళనంలో మాత్రమే కలిశామన్నారు.
శ్రీనివాసరావును మున్నూరు కాపు బిడ్డగా .. ఐపీఎస్ ఆఫీసర్గా గుర్తించాం తప్ప.. అతడితో ఎలాంటి లావాదేవీలు జరపలేదు. మేము అతడికి ఎక్కడా గిఫ్టులు గానీ.. గోల్డ్ గానీ ఇవ్వలేదన్నారు గంగుల కమలాకర్, వద్దిరాజు.












Click it and Unblock the Notifications