అమిత్ షాజీ.. థాంక్స్: కేటీఆర్
సెంట్రల్ రిజర్వు పోలీస్ ఫోర్స్(CRPF)లో నియామక పరీక్షలను తెలుగుతో సహా 13 ప్రాంతీయ భాషల్లో నిర్వహించేందుకు అనుమతి ఇచ్చినందుకు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాకు తెలంగాణ మంత్రి కేటీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. దీనివల్ల తెలుగు రాష్ట్రాల నుంచి పరీక్ష రాసే వేలమంది అభ్యర్థులకు లబ్ధి చేకూరుతుందంటూ ట్వీట్ చేశారు.
సీఆర్పీఎఫ్లో భారీగా ఉద్యోగాల భర్తీకి విడుదల చేసిన నోటిఫికేషన్ను సవరించాలని మంత్రి కేటీఆర్ అమిత్ షాకు ఇటీవలే విజ్ఞప్తి చేశారు. మొత్తం 9,212 ఉద్యోగాల నియామకం కోసం విడుదల చేసిన నోటిఫికేషన్లో కేవలం హిందీ, ఆంగ్లంలోనే పరీక్ష నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, ఇతర అధికారిక భాషలను సైతం దాంట్లో చేర్చాలని కేటీఆర్ కోరారు. ఆంగ్ల మాధ్యమంలో చదవనివారు, హిందీయేతర రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.

ఇదే అంశంపై ఇటీవల తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కూడా అమిత్ షాకు లేఖ రాశారు. 100 మార్కుల్లో 25 మార్కులు హిందీకి కేటాయించడం ద్వారా హిందీ తెలిసినవారికి మాత్రమే ఈ పరీక్షలు అనుకూలంగా ఉంటాయని, ఇది పౌరుల సమాన హక్కులను తిరస్కరించేలా ఉందన్నారు. ఈ వ్యవహారంలో అమిత్ షా జోక్యం చేసుకోవాలని, హిందీ భాష తెలియని యువత కూడా సీఆర్పీఎఫ్లో పనిచేసేందుకు ప్రాంతీయ భాషల్లో పరీక్ష జరిగేలా ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు. ఈ అభ్యర్థనలను కేంద్రం పరిగణనలోకి తీసుకుంది. సీఆర్పీఎఫ్ నియామక పరీక్షను ప్రాంతీయ భాషల్లో నిర్వహించడానికి అనుమతిచ్చింది. ఈ నేపథ్యంలోనే కేంద్ర హోం మంత్రి అమిత్ షాకి కేటీఆర్ ట్విటర్ ద్వారా కృతజ్ఞతలు తెలిపారు












Click it and Unblock the Notifications