కేసీఆర్తో విసిగిపోయారు, తెలంగాణలోనూ బీజేపీ ప్రభుత్వం: కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్
హైదరాబాద్: తెలంగాణ ప్రజలు కేసీఆర్ ప్రభుత్వ విధానాలతో విసిగిపోయారన్నారు కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్. హైదరాబాద్ నగరంలో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశం జరగనున్న క్రమంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని అనురాగ్ ఠాకూర్ ధీమా వ్యక్తం చేశారు.
తెలంగాణలోని చాలా మంది ప్రజలు బీజేపీకి మద్దతు పలుకుతున్నారని కేంద్రమంత్రి చెప్పారు. రాబోయే కాలంలో బీజేపీలోకి చేరికలు భారీగా ఉంటాయని అనురాగ్ ఠాకూర్ తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రధాని నరేంద్ర మోడీ అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టారని చెప్పారు. ప్రతి రాష్ట్ర అభివృద్ధిలో మోడీ ప్రభుత్వం తన వంతుగా కీలక పాత్ర పోషిస్తోందన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వ విధానాలతో తెలంగాణ ప్రజలు తీవ్రంగా విసిగిపోయారన్నారు అనురాగ్ ఠాకూర్. బీజేపీ జాతీయ కార్యవర్గం సమావేశాలు జూలై 2, 3 తేదీలలో హైదరాబాద్లో రెండు రోజుల పాటు జరగనున్నాయి. ఈ సమావేశాల కోసం ప్రధాని నరేంద్ర మోడీతోపాటు దేశం నలుమూలల నుంచి పార్టీ ఇతర సీనియర్ నాయకులు నగరానికి వస్తున్నారు. 2019 నుంచి తెలంగాణలో బీజేపీ పుంజుకుంటోంది. ఈ నేపథ్యంలోనే పార్టీ కాన్క్లేవ్ ముగిసిన వెంటనే జూలై 3న పరేడ్ గ్రౌండ్స్లో జరిగే బహిరంగ సభలో మోడీ ప్రజలనుద్దేశించి మాట్లాడనున్నారు. కాగా, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు వచ్చే ఏడాది చివరన జరగనున్నాయి.
బీజేపీ ఓబీసీ మోర్చా నేషనల్ ప్రెసిడెంట్ కే లక్ష్మణ్ మాట్లాడుతూ.. కేసీఆర్ ప్రభుత్వ తీరుతో రాష్ట్ర ప్రజలు విసిగిపోయారని, ఆయనను ఇంటికి పంపించేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. తెలంగాణ రాష్ట్రంలోనూ డబుల్ ఇంజిన్ సర్కారును ప్రజలు కోరుకుంటున్నారన్నారు.