ఖమ్మం సభతో మారిపోయిన తెలంగాణ రాజకీయం?
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తన పార్టీని భారత రాష్ట్ర సమితిగా మార్పు చేయడంతో అనూహ్యమైన పరిణామాలకు తెలంగాణ రాజకీయం వేదికగా మారుతోంది. రెండుసార్లు ముఖ్యమంత్రి అవడానికి తోడ్పడిన తెలంగాణ సెంటిమెంట్ ను చంపేసి జాతీయ వాదంతో భారత రాష్ట్ర సమితిని ఏర్పాటు చేయడంతో రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ మరోసారి ఊపిరి పోసుకుంటోంది. దీనివల్ల రాజకీయంగా లెక్కలన్నీ మారిపోతున్నాయి.

బీఆర్ఎస్ నేతల విమర్శల జడివాన
బీఆర్ఎస్ తో పార్టీలన్నీ తెలంగాణకు ద్రోహం చేస్తున్నాయనే ప్రచారం ఉండదు కాబట్టి తన ఉనికిని చాటుకోవడానికి తెలుగుదేశం పార్టీ ఖమ్మంలో బహిరంగసభ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అంచనాలకు మించి విజయవంతం కావడంతో ఇతర పార్టీలన్నీ ఉలిక్కిపడ్డాయి. బీఆర్ఎస్ నాయకులు విమర్శల జడివాన కురిపించారు. తెలంగాణలో టీడీపీ నిర్వహించే సభకు ఇంత భారీగా జనసందోహం రావటమా? అన్నది ఇప్పుడు రాష్ట్ర రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

కూడికలు, తీసివేతలపై చర్చ
తెలుగుదేశం పార్టీ తెలంగాణలో బలపడితే ఎవరికి లాభం? ఎవరికి నష్టం? అనే ప్రశ్న తలెత్తుతోంది. రాజకీయ వర్గాల్లో కూడికలు, తీసివేతలపై చర్చ నడుస్తోంది. తెలుగుదేశం పార్టీ నుంచి అత్యధిక సంఖ్యలో నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలు, ఓటర్లు భారత రాష్ట్ర సమితిలోకి వెళ్లారు. టీడీపీకి గట్టి పట్టున్న ప్రాంతాల్లో చీలే ఓట్లు బీఆర్ఎస్ కు నష్టం చేకూరుస్తాయని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.

సెటిలర్ల ఓట్లలో చీలిక?
రాష్ట్రవ్యాప్తంగా టీడీపీకి పట్టున్న ప్రాంతాలతోపాటు గ్రేటర్ హైదరాబాద్-రంగారెడ్డిలో కూడా సెటిలర్ల ఓట్లు చీలబోతున్నాయి. గత ఎన్నికల్లో టీడీపీ ఓట్లన్నీ బీఆర్ఎస్ కు వచ్చాయి. 2019 ఎన్నికల్లో చంద్రబాబుకు వ్యతిరేకంగా, జగన్ కు అనుకూలంగా కేసీఆర్ పావులు కదిపిన సంగతి తెలిసిందే. ఏపీలో టీడీపీ ఓటమికి కారణం బీఆర్ఎస్ అనే కోణంలో ఇక్కడి టీడీపీ అభిమానులు గుర్రుగా ఉన్నారు. వారికి ఇప్పుడు తెలుగుదేశం రూపంలో అవకాశం లభించడంతో వారంతా టీడీపీకి ఓట్లేసే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. టీడీపీ చీల్చే ప్రతి ఓటు మేరకు కేసీఆర్ కు నష్టం జరిగే అవకాశం ఉందనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి.












Click it and Unblock the Notifications