అస్తవ్యస్థంగా తెలంగాణ గ్రామీణ రోడ్లు..! మురిగిపోయిన కేంద్ర రహదారుల నిధులు..!!
హైదరాబాద్ : దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించలేదన్నట్లు ఉంది రాష్ట్రంలో గ్రామీణ రోడ్ల పరిస్థితి. రాష్ట్ర ప్రభుత్వం 200 కోట్ల రూపాయలను విడుదల చేస్తే.. కేంద్రం నుంచి 2000 కోట్ల రూపాయలకు పైగా నిధులు వచ్చే అవకాశం ఉంది. ఆ కొద్దిపాటి నిధులను కూడా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడం లేదు. దాంతో, గ్రామీణ రోడ్లకు గుంతల నుంచి విముక్తి కలగడం లేదు. రాష్ట్రం నుంచి స్పందన కరువవడంతో కేంద్రమూ నిధుల విడుదలను నిలిపేసింది. భవిష్యత్తులో కేంద్రం నుంచి నిధులు విడుదలయ్యే పరిస్థితి లేదు.
మ్యాచింగ్ గ్రాంట్ సమకూర్చలేక చేతులెత్తేసిన ప్రభుత్వం..! రెండువేల కోట్లకు కేంద్రం ఎగనామం..!!
ఒకవేళ గ్రామీణ రోడ్లను వేయాలనుకుంటే రాష్ట్ర ప్రభుత్వమే మొత్తం నిధులను ఖర్చు చేయాల్సిన పరిస్థితి! ఫలితంగా, ఇప్పటికే కొనసాగుతున్న 563 కోట్ల రూపాయల పనులతో పాటు భవిష్యత్తులో రావాల్సిన 2000 కోట్ల రూపాయలకు పైగా పనులకూ ముప్పు ముంచుకొచ్చింది. రాష్ట్రంలో పీఎంజీఎస్ వై పథకాన్ని కొనసాగించాలనుకుంటే వెంటనే 177 కోట్ల రూపాయలను విడుదల చేయాలని, లేకపోతే, ఈ పథకం కింద కేంద్ర వాటాను కూడా రాష్ట్ర ప్రభుత్వమే భరించాల్సి వస్తుందంటూ పంచాయతీరాజ్ శాఖ కొద్ది రోజుల కిందట రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక పంపింది. అందులోని వివరాలు బయటకు పొక్కడంతో పీఎంజీఎస్ వై ప్రహసనం వెలుగు చూసింది.
కేంద్రం డబ్బులిచ్చినా వాడుకోలేని రాష్ట్రం..! 200 కోట్లు ఇస్తే 2000 కోట్లకుపైగా వచ్చే చాన్స్..!!
పీఎంజీఎస్ వై మొదటి దశ కింద రాష్ట్రానికి కేంద్రం 342.82 కోట్ల రూపాయల పనులను మంజూరు చేసింది. వీటిలో రోడ్లకు 210 కోట్లు కాగా, వంతెనల బడ్జెట్ 132 కోట్లు. అలాగే, పీఎంజీఎస్ వై రెండో దశ కింద 220 కోట్ల పనులు జరుగుతున్నాయి. రెండు దశల్లోనూ కలిపి 2018-19 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణలో 563 కోట్ల పనులు కొనసాగుతున్నాయి. వీటి మొత్తం ఖర్చులో 60శాతం కేంద్రం భరిస్తే.. 40శాతం నిధులను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయాల్సి ఉంటుంది. పీఎంజీఎస్ వై-1 కింద పనులను ఈ ఏడాది మార్చి 31వ తేదీకే పూర్తి చేయాలి కూడా. ఆలోపు పనులు పూర్తి చేయలేకపోతే, మొత్తం వంద శాతం ఖర్చునూ రాష్ట్ర ప్రభుత్వమే భరించాల్సి ఉంటుంది.
మురిగిపోయిన 254 కోట్లు.. 2 వేల కోట్ల పనులకు ముప్పు..!!
రాష్ట్ర ప్రభుత్వం 100 కోట్ల రూపాయలు విడుదల చేస్తే, కేంద్రం నుంచి దాదాపు 450 కోట్ల రూపాయలు వచ్చేవి. కానీ, రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఆ నిధులు మురిగిపోయాయి. రాష్ట్రం తన వాటా 106 కోట్లను విడుదల చేయకపోవడంతో 2016-17లో 150 కోట్లు; 2017-18లో 103 కోట్లు మురిగిపోయాయి. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం 49 కోట్లను విడుదల చేయకపోతే 2018-19 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మరో 200 కోట్లు కూడా మురిగిపోనున్నాయి. పీఎంజీఎస్ వై-3 కింద ఎనిమిది రాష్ట్రాలను కేంద్రం ఎంపిక చేసింది. వాటిలో తెలంగాణ ఒకటి. ఈ పథకం కింద దాదాపు 2 వేల కోట్ల రూపాయలతో 2400 కిలోమీటర్ల గ్రామీణ రోడ్లను మంజూరు చేయనుంది. ఇప్పుడు దీనిని పెండింగ్లో పెట్టింది. రాష్ట్ర ప్రభుత్వం 177 కోట్ల రూపాయలు విడుదల చేస్తే.. కేంద్రం మరో 100 కోట్లను విడుదల చేయడమే కాదు.. మూడో విడత రోడ్ల మంజూరులూ దక్కుతాయి. అయినా, సర్కారు ఏమాత్రం పట్టించుకోవడం లేదు.
29 రాష్ట్రాల అధికారుల ముందు తల దించుకున్న రాష్ట్ర అధికారులు...! ఎందుకింత అలస్వం..!!
పీఎంజీఎస్ వై పనుల పురోగతిపై కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ఇటీవల వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించింది. ఇందులో మొత్తం 29 రాష్ట్రాల పంచాయతీరాజ్శాఖ అధికారులూ పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ అధికారులపై కేంద్ర అధికారులు తీవ్రస్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేశారు. నిధులను మురగబెట్టడంతోపాటు రాష్ట్ర వాటా విడుదల చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎప్పటికప్పుడు ఈమెయిల్స్ పంపుతున్నాం. వీడియో కాన్ఫరెన్స్ల్లో చెబుతున్నాం. వాట్సాప్ గ్రూపుల్లో హెచ్చరిస్తున్నాం. అయినా పట్టించుకోకపోవడం ఏమిటి!? అంటూ తలంటారు. దాంతో, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు తల దించుకోవాల్సి వచ్చింది. నిజానికి, సంబంధిత ఫైల్స్ అన్నీ ఆర్థిక శాఖలో పెండింగులో ఉన్నాయి. అక్కడి నుంచి గ్రీన్సిగ్నల్ రాకపోవడంతో కేంద్రం నుంచి నిధులు ఆగిపోయే పరిస్థితి ఏర్పడింది.