యావద్దేశానికి ఆదర్శం తెలంగాణ - సీఎం కేసీఆర్..!!
దేశం మొత్తం తెలంగాణ సామర్ధ్యం ఏంటో గుర్తించిందని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు. తెలంగాణ చరిత్రలో సెప్టెంబర్ 17కి ఒక ప్రత్యేకత ఉందని పేర్కొన్నారు. రాష్ట్రం సాకారం అయిన సమయం నుంచి అన్ని రంగాల్లోనూ పురోగతి సాధించామని వివరించారు. జాతీయ సమైక్యతా దినోత్సవ వేడుకల్లో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. జాతీయ జెండాను సీఎం ఆవిష్కరించారు. తెలంగాణ ఆచరించిన విధానాన్నే దేశం అనుసరిస్తోందని కేసీఆర్ చెప్పుకొచ్చారు.
జాతీయ సమైక్యతా దినోత్సవ వేడుకల్లో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. వేడుకల్లో పాల్గొనేందుకు పబ్లిక్ గార్డెన్స్ వచ్చిన ముఖ్యమంత్రికి పోలీసులు గౌరవ వందనం సమర్పించారు. అనంతరం సీఎం జాతీయ జెండాను ఎగురవేశారు. హైదరాబాద్ సంస్థానం కూడా 1948 సెప్టెంబర్ 17న సువిశాల భారతదేశంలో అంతర్భాగమయిందని తెలిపారు. 1956లో జరిగిన రాష్ట్రాల పునర్విభజనలో భాగంగా తెలంగాణ ప్రాంత ప్రజల మనోభీష్టానికి విరుద్ధంగా తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాలను కలిపి ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు చేయడం, దాని దుష్పరిణామాలు మనందరికీ తెలిసినవేనని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతానికి, ప్రజానీకానికీ జరిగిన తీరని అన్యాయాలను, అక్రమాలను, సమైక్య పాలకుల ఆధిపత్యాన్ని ఎదిరించి, తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ఉద్యమ బావుటా ఎగురవేశామని గుర్తు చేసారు.

ఆ మహోద్యమానికి తానే స్వయంగా సారథ్యం వహించడం చరిత్ర తకు అందిన మహదవకాశంగా పేర్కొన్నారు. అందరి సహకారంతో ఉద్యమాన్ని విజయతీరం చేర్చగలిగానని వివరించారు. స్వరాష్ర్టంలో ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే గురుతర బాధ్యతను సైతం తన భుజస్కంధాలపైనే మోపారన్నారు. 2014 జూన్ 2న తెలంగాణ రాష్ట్రం సాకారమైన నాటి నుంచి జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు యావద్దేశానికి ఆదర్శంగా నిలిచాయని చెప్పారు. నూతన రాష్ట్రం తెలంగాణ అనుసరిస్తున్న విధానం సమగ్రమైనదని అన్ని వర్గాల ప్రయోజనాలను నెరవేరుస్తూ సాగుతున్న సమ్మిళిత, సమీకృత అభివృద్ధి నమూనా ఆదర్శవంతమైనదని యావద్దేశం ప్రశంసిస్తున్నదని వివరించారు.
రాష్ట్రంలో నేడు ప్రభుత్వ పథకాల లబ్ధి పొందని కుటుంబమేదీ లేదని ఘంటాపథంగా చెప్పవచ్చని సీఎం పేర్కొన్నారు. ప్రభుత్వ పథకాల ఫలితంగానే నేడు రాష్ట్రంలో పేదరికం తగ్గి, తలసరి ఆదాయం పెరిగింది. 2015-18 నాటికి తెలంగాణలో 13.18 శాతంగా ఉన్న పేదరికం, 2019-21 నాటికి 5.88 శాతానికి దిగివచ్చిందని వివరించారు. తలసరి ఆదాయంలో దేశంలోనే తెలంగాణ నంబర్ వన్ స్థానంలో నిలిచిందని కేసీఆర్ వివరించారు. నిరంతరం శ్రమించి రాష్ట్రంలోని అన్నిరంగాలనూ బలోపేతం చేయడంతోపాటు, అభివృద్ధి అంటే ఏమిటో అనతికాలంలోనే దేశానికి చాటి చెప్పగలిగామని ముఖ్యమంత్రి వెల్లడించారు. ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు తెలంగాణ రాష్ట్ర పథకాలను అనుసరించడం, తెలంగాణలో సాగుతున్న సుపరిపాలనను తమ రాష్ట్రాల్లో సైతం సాగాలని అక్కడి ప్రజలు కోరుకుంటున్నారని వివరించారు.












Click it and Unblock the Notifications