వాదన బలంగా వినిపించాలి: కేఆర్ఎంబీ సమావేశానికి తెలంగాణ హాజరుకావాలన్న కేసీఆర్
హైదరాబాద్: సెప్టెంబర్ 1 న జరగబోయే కేఆర్ఎంబీ సమావేశానికి తెలంగాణ హాజరు కావాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఈ సమావేశంలో తెలంగాణకు కృష్ణాజలాల్లో దక్కాల్సిన న్యాయమైన వాటాకోసం బలమైన వాదనలు వినిపించాలని ఇరిగేషన్ శాఖ అధికారులను సీఎం ఆదేశించారు. ఈ సందర్భంగా అనుసరించాల్సిన వ్యూహంపై అధికారులకు దిశానిర్దేశం చేశారు.
కేఆర్ఎంబీ సమావేశంలో చర్చకు రాబోయే ఎజెండా అంశాలపై ప్రగతి భవన్లో బుధవారం సీఎం కేసీఆర్ అధ్యక్షతన అత్యున్నత స్థాయి సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సీఎస్ సోమేశ్ కుమార్, ఇరిగేషన్ స్పెషల్ సీఎస్ రజత్ కుమార్, సీఎం కార్యదర్శులు స్మితా సబర్వాల్, భూపాల్ రెడ్డి, ఇరిగేషన్ ఈఎన్సీ మురళీధర్, సీఎం ఓఎస్డీ శ్రీధర్ దేశ్ పాండే, మాజీ అడ్వకేట్ జనరల్ రామకృష్ణా రెడ్డి, బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ లో సీనియర్ న్యాయవాది రవీందర్ రావు, ఇంటర్ స్టేట్ విభాగం చీఫ్ ఇంజనీర్ మోహన్ కుమార్, సూపరింటెండింగ్ ఇంజనీర్ కోటేశ్వర్ రావు, తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. కృష్ణా జలాల్లో తెలంగాణ న్యాయమైన నీటి వాటా కోసం కేఆర్ఎంబీ, ట్రిబ్యునల్స్ సహా అన్నిరకాల వేదికల మీద బలమైన వాదనలు వినిపించాలని పునురుద్ఘాటించారు. సాధికారిక సమాచారంతో కేఆర్ఎంబీ సమావేశంలో సమర్థవంతంగా వాదనలు వినిపించాలని అధికారులకు సీఎం కేసీఆర్ సూచించారు.
మరోవైపు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య జల వివాదం కొనసాగుతూనే ఉంది. రెండు రాష్ట్రాల మధ్య నీటి వాటాను 50:50 శాతంగా పంచాలని తెలంగాణ ప్రభుత్వం డిమాండ్ చేస్తుండగా.. అయితే, అది మాత్రం పగటి కలేనని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి అంటున్నారు. కేఆర్ఎంబీకి లేఖ రాసినట్లు 70:30 శాతం నీటి కేటాయింపులు గతంలోనే చేశారన్న ఆయన.. రాష్ట్ర విభజన సమయంలో రెండు రాష్ట్రాలు చేసుకున్న ఒప్పందం 70:30 ప్రకారమే ముందుకు వెళ్లాలని స్పష్టం చేశారు.. దీనిలో కొత్త వాదన ఏమీ లేదన్న ఆయన.. అంగీకరించిన విషయాన్ని తెలంగాణ ప్రశ్నించటం అసంబద్ధం అన్నారు.
Recommended Video
ఇది ఇలావుండగా, టీడీపీ నేతలపైనా విమర్శలు గుప్పించారు సజ్జల. టీడీపీకి తమ ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు లేదని మండిపడ్డారు. టీడీపీ హయాంలో ప్రభుత్వం అన్ని రంగాల్లోనూ ఘోరంగా విఫలమైందన్నారు. తమ ప్రభుత్వం వచ్చిన తర్వాతే దళితులు, మహిళలపై దాడులు అరికట్టడానికి సమగ్ర ప్రణాళిక రూపొందించామన్నారు. మహిళల భద్రత గురించి చంద్రబాబు ఎప్పుడైనా పట్టించుకున్నారా? అని ప్రశ్నించారు. రిషితేశ్వరి కేసు ఇప్పటికీ కొలిక్కి రాలేదు.. ఎస్సీలపై రిపోర్ట్ కాని దాడులు , లెక్కలేనన్ని టీడీపీ హయాంలో జరిగాయని ఆరోపించారు. రమ్య ఘటన పై ఎస్సీ జాతీయ కమిషన్ వైస్ ఛైర్మన్ ప్రభుత్వం వందకు రెండు వందల శాతం పని చేసిందని ప్రశంసించారని ఈ సందర్భంగా వ్యాఖ్యానించిన ఆయన.. దిశ చట్టం ఇంకా కేంద్రం దగ్గరే ఉందన్నారు. మహిళల భద్రత కోసం దిశ లాంటి చట్టం తీసుకు రావాలన్న ఆలోచన అయినా చంద్రబాబు, లోకేష్ చేశారా? అని నిలదీశారు సజ్జల.