మేం ముందే: లారా-పరిణీతి ప్రోగ్రాంలో కెటిఆర్, పీడ వదిలిందనుకుంటే: జగదీశ్వర్
హైదరాబాద్: తెలంగాణ రాష్ర్టాన్ని డిజిటల్ రాష్ట్రంగా తీర్చిదిద్దుతున్నట్లు ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు బుధవారం తెలిపారు. హైదరాబాద్ నగరంలోని హోటల్ తాజ్కృష్ణలో ‘యుప్ టీవీ' ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది.
ఈ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్, క్రికెటర్ బ్రియాన్ లారా, బాలీవుడ్ హీరోయిన్ పరిణీతి చోప్రా తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడారు. టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో భారతీయులు ఎప్పుడూ ముందుంటారన్నారు.
హైదరాబాద్ నగరానికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉందని చెప్పారు. తెలంగాణను డిజిటల్ రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని, ప్రతి ఇంటికి ఇంటర్నెట్ సౌకర్యం కల్పించే దిశలో ముందుకు సాగుతున్నామని చెప్పారు. జలహారంతో పాటు బ్రాడ్బాండ్ కనెక్టివిటీ అందించేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు.
ద్రోహుల పీడ వదిలిందనుకుంటే: జగదీష్
వచ్చే రబీ పంటకు రైతులకు పగటిపూట తొమ్మిది గంటల ఉచిత విద్యుత్ అందించనున్నట్లు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డి తెలిపారు. ప్రతిపక్ష పార్టీల ఆరోపణలపై మంత్రి ఆయన స్పందించారు. సీఎం కెసిఆర్ పక్కా వ్యూహంతో నిరంతర విద్యుత్ అందిస్తున్నారన్నారు.
రాష్ట్రం ఏర్పాటుతో తెలంగాణ ద్రోహుల పీడ వదిలిందనుకున్నామని, కానీ ప్రతిపక్ష పార్టీల నేతలు ఇంకా తెలంగాణ వ్యతిరేకులుగానే వ్యవహరిస్తున్నారన్నారు. సమస్యల పరిష్కారానికి ప్రతిపక్షాలు కలిసి రావడం లేదన్నారు. సీఎం కేసీఆర్ ధృడ సంకల్పంతో రాష్ర్టాన్ని ముందుకు తీసుకెళ్తున్నరన్నారు.
అవినీతి బట్టబయలు లేదంటే రాజీనామా: నాగం
తాను ప్రభుత్వంలోని అవినీతిని బట్టబయలు చేస్తానని లేదంటే రాజకీయాల నుంచి తప్పుకుంటానని బిజెపి నేత నాగం జనార్ధన్ రెడ్డి సవాల్ చేశారు. రైతులు సంక్షోభంలో ఉంటే ప్రభుత్వానికి పట్టడం లేదని మండిపడ్డారు.