సిరియా మిసైల్ దాడి: సౌదీలో తెలంగాణ ఇంజనీర్ మృతి
దుబాయ్: అరబ్ దేశాల మధ్య జరుగుతున్న ఆధిపత్యయుద్ధంలో మరో తెలుగు పౌరుడు ప్రాణాలు కోల్పోయాడు. ఉపాధి నిమిత్తం వచ్చి దుబాయ్లో పనిచేస్తున్న ఓ తెలుగు ఇంజనీర్ శుక్రవారం జిజాన్ పట్టణంలో దుర్మరణం చెందాడు.
మెదక్ పట్టణంలోని ఆజంపురాకు చెందిన ఎండి. లహేక్ హైమద్(34) బీటెక్ పూర్తి చేసి ఉపాధి వెతుక్కుంటూ సౌదీ అరేబియా వెళ్లాడు. ఓ ప్రైవేట్ కంపెనీలో అసిస్టెంట్ ఇంజనీర్ గా ఉద్యోగం లభించడంతో దుబాయ్లోని జిజాన్ ప్రాంతంలో ఉంటున్నాడు. శుక్రవారం సెలవురోజు కావటంతో సమీపంలో ఉండే తన స్నేహితుడ్ని కలుసుకునేందుకు జిజాన్ నుంచి కారులో బయలుదేరాడు.
కొద్ది దూరం వెళ్లగానే లహేక్ ప్రయాణిస్తున్న కారుపై సిరియా పేల్చిన మిస్సైల్ వచ్చిపడింది. ఈ ఘటనలో లహేక్ తోపాటు దాదాపు 60 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. సౌదీలోనే ఉంటున్న అతడి బాబాయ్ లహేక్ మరణవార్తను మెదక్ లోని కుటుంబసభ్యులకు చేరవేశాడు.
హైమద్ మరణంతో మెదక్ పట్టణంలో విషాద వాతావరణం నెలకొంది. విషయం తెలుసుకున్న తెలంగాణ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి లహేక్ ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు.