తెలంగాణలో ముందుంది.. ఎండల పండగ: కారణం ఇదే
Temperature in Telangana: తెలంగాణలో ఎండ తీవ్రత రోజురోజుకూ విపరీతంగా పెరుగుతోంది. ఉక్కపోతకు గురి చేస్తోంది. ఈ నెల మొదటి వారం నుంచే రాష్ట్రవ్యాప్తంగా అనేక ప్రాంతాలు పగటి ఉష్ణోగ్రత చుక్కలు చూపిస్తోంది. నడివేసవి నాటి వాతావరణాన్ని తలపిస్తోంది. ఫిబ్రవరి తొలి అర్ధభాగంలోనే రాష్ట్రంలో సగటు ఉష్ణోగ్రత 35 నుంచి 37 డిగ్రీలుగా నమోదవుతోండటమే దీనికి నిదర్శనం.
వచ్చే వారం రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రత సాధారణం కంటే రెండు నుంచి నాలుగు డిగ్రీల సెల్సియస్ వరకు అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం అంచనా వేసింది. ఉత్తర తెలంగాణ జిల్లాలో గరిష్ఠ ఉష్ణోగ్రత 38 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లో అప్పుడే 36 డిగ్రీలకు పైగా పగటి ఉష్ణోగ్రత నమోదవుతోంది.

ఈ వేసవి సీజన్లో ఎండ తీవ్రత అసాధారణంగా ఉంటుందని, అకాల వేడిని ఎదుర్కొనాల్సి రావొచ్చని హైదరాబాద్ వాతావరణ కేంద్రం చీఫ్ సైంటిస్ట్ డాక్టర్ కే నాగరత్న తెలిపారు. ఫిబ్రవరిలో ఇప్పటికే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని, వచ్చే వారం రోజుల్లో వేడి తీవ్రత మరింత పెరుగుతుందని అన్నారు. తూర్పు గాలులు నిరంతర వేడెక్కుతుండటమే దీనికి కారణమని అన్నారు.
తెలంగాణ డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీ డేటా ప్రకారం- కరీంనగర్, కొమురం భీమ్, పెద్దపల్లిల్లో అత్యధికంగా 38.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. వనపర్తి, నాగర్కర్నూల్లల్లో 38.2, నిజామాబాద్, మంచిర్యాల, రంగారెడ్డి జిల్లాల్లో 38 డిగ్రీల సెల్సియస్ మేర గరిష్ఠ ఉష్ణోగ్రత రికార్డయింది.
హైదరాబాద్లోని బడా బజార్- 36.2 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. గత సంవత్సరం ఇదే తేదీన నగరంలో రికార్డయిన అత్యధిక ఉష్ణోగ్రత 37.1 డిగ్రీల సెల్సియస్. యాకుత్పురా ఎస్ఆర్టీ కాలనీలో ఇది నమోదైంది. గత ఏడాది ఫిబ్రవరితో పోలిస్తే ఈ దఫా అనేక జిల్లాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవడం మరింత ఆందోళనకరం.
కరీంనగర్ వెదురుగట్టులో 38.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా.. గత సంవత్సరం జమ్మికుంట ఏఆర్ఎస్లో 36.5 డిగ్రీలుగా రికార్డయింది. నల్గొండ జిల్లా మడుగులపల్లిలో గత ఏడాది ఫిబ్రవరిలో 37.9 డిగ్రీల ఎండ తీవ్రత నమోదు కాగా.. ఇప్పుడా సంఖ్య రెండు డిగ్రీల మేర పెరిగింది. 38.2 డిగ్రీలుగా నమోదైంది.












Click it and Unblock the Notifications