విభజన తర్వాత భయపడ్డా: కరీంనగర్లో తెలంగాణ ప్రజల ప్రేమపై టిజి వెంకటేష్
కరీంనగర్: రాష్ట్ర విభజన అనంతరం, ఏపీ - తెలంగాణ రాష్ట్రాలుగా విడిపోయాక, మనసులు ఎక్కడ విడిపోతాయోనని తనకు భయం వేసిందని, ప్రస్తుతం ఆ భయం తొలగిపోయిందని టిడిపి నేత, రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ ఆదివారం అన్నారు.
ఆయన కరీంనగర్ జిల్లాలో జరిగిన అంతర్జాతీయ వైశ్య సమాఖ్య రాష్ట్ర తృతీయ మహాసభలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడారు. ప్రాంతాలుగా విడిపోయనా తెలుగువారిగా కలిసే ఉంటున్నామని చెప్పారు. రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన తర్వాత తెలంగాణ ప్రజలు తన పైన చూపిన ప్రేమ మరవలేనిదన్నారు.
రాజకీయాలు వేరు, ప్రాంతాలు వేరని, ఉద్యమాల సందర్భంగా ఇరు ప్రాంతాల నాయకులు విమర్శలు చేసుకున్నప్పటికీ, కలిసే ఉన్నామని చెప్పారు.
రెండు రాష్ట్రాల సమస్యలకు త్వరలోనే పరిష్కారం లభిస్తుందని ఈ సందర్భంగా టీజీ వెంకటేష్ ఆశాభావం వ్యక్తం చేశారు. రెండు రాష్ట్రాల మధ్య కొన్ని సమస్యలు ఉన్నాయని, అవి తీరుతాయన్నారు. రానున్న రోజుల్లోను తెలుగు ప్రజలు అన్యోన్యంగా ఉంటారని చెప్పారు.
మంత్రి ఈటెల రాజేందర్ మాట్లాడుతూ.. ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా ఉన్న టిజి వెంకటేష్, శాసన సభ్యుడిగా తాను పని చేశామని గుర్తు చేసుకున్నారు. తెలంగాణ ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తోందన్నారు. సంక్షేమ పథకాల అమలులో దేశంలోనే తొలి స్థానంలో ఉందని చెప్పారు. వైశ్యులకు ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు.