హైదరాబాద్ లో ఆ సిటీ బస్సులు ఇక కనిపించవ్
హైదరాబాద్ రోడ్లపై మరిన్ని సిటీ బస్సులు పరుగులు పెట్టబోతోన్నాయి. నగర పరిధి భారీగా విస్తరిస్తోన్న ప్రస్తుత పరిస్థితుల్లో రోజువారీ ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా వాటి సంఖ్యను గణనీయంగా పెంచనుంది టీజీఎస్ఆర్టీసీ. కొత్త బస్సులను అందుబాటులోకి తీసుకుని రానుంది. వచ్చే రెండు నెలల్లో దశలవారీగా 275 కొత్త సిటీ బస్సులను నడిపించడానికి అవసరమైన ప్రణాళికలను రూపొందించుకుంది. దీన్ని కార్యాచరణలో పెట్టనుంది.
మరో ముందడుగు..
దీన్ని మరింత విస్తరించనుంది. ఈ క్రమంలో మరో అడుగు ముందుకేసింది టీజీఎస్ఆర్టీసీ. ప్రస్తుతం హైదరాబాద్ సిటీలో ప్రయాణికుల కోసం అందుబాటులో ఉన్న 2,800 డీజిల్ బస్సులను తొలగించాలని నిర్ణయించింది. వాటి స్థానంలో ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టనుంది. దశలవారీగా ఈ కార్యక్రమం చేపడుతుంది టీజీఎస్ఆర్టీసీ. వచ్చే రెండేళ్లల్లో అంటే.. 2027 నాటికి ఈ 2,800 డీజిల్ బస్సులన్నీ కూడా కనిపించవు. వాటి స్థానంలో ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి రావడం ఖాయంగా కనిపిస్తోంది.

రూ. 400 కోట్లు..
దీనికోసం 400 కోట్ల రూపాయలను టీజీఎస్ఆర్టీసీ అధికారులు ఖర్చు పెట్టనున్నారు. ఎలక్ట్రికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ను అభివృద్ధి చేయడానికి ఈ మొత్తాన్ని వినియోగిస్తారు. ఛార్జింగ్ పాయింట్ల నెలకొల్పుతారు. బస్టాపులను ఆధునికీకరించే అవకాశం లేకపోలేదు. అన్నీ ఎలక్ట్రిక్ వాహనాలే అందుబాటులోకి రానున్న నేపథ్యంలో దీనికి అనుగుణంగా వాటిని తీర్చిదిద్దవచ్చు. ఎలక్ట్రిక్ బస్సులకు అనుకూలంగా డిపోలనూ మార్పులు చేర్పులు చేయవచ్చని తెలుస్తోంది.
80 శాతానికి పైగా ఆక్యుపెన్సీ..
ప్రస్తుతం హైదరాబాద్ లో 200 అత్యాధునిక ఎలక్ట్రిక్ బస్సులు సేవలందిస్తోన్నాయి. పలుమార్గాల్లో పరుగులు పెడుతున్నాయి. ప్రస్తుతం 80 శాతం సగటు ఆక్యుపెన్సీని అందుకుంటోన్నాయవి. ప్రయాణికుల నుంచి లభిస్తోన్న ఆదరణను దృష్టిలో పెట్టుకుని ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేసరికి 1,000 ఈవీ బస్సులను అందుబాటులోకి తీసుకుని రావాలని టీజీఎస్ఆర్టీసీ భావిస్తోంది. ఇందులో భాగంగా వచ్చే రెండు నెలల్లో కొత్తగా ఈ 275 బస్సులను నడిపించనుంది.
ప్రధాన మార్గాల్లో..
ఎంజీబీఎస్, జేబీఎస్, అఫ్జల్ గంజ్, చార్మినార్, కోఠి, సికింద్రాబాద్, కాచిగూడ, కూకట్ పల్లి, పఠాన్ చెరు, జీడిమెట్ల, కొండాపూర్, బీహెచ్ఈఎల్, ఈసీఐఎల్, కుషాయిగూడ, శంషాబాద్ ఎయిర్ పోర్ట్, ఎల్బీ నగర్, ఉప్పల్.. వంటి ప్రధాన పాయింట్లను కేంద్ర బిందువుగా చేసుకుని.. దాదాపుగా అన్ని రద్దీ మార్గాల్లో ఈ కొత్త 275 ఈవీ బస్సులను అందుబాటులోకి రానున్నాయి. ఐటీ కారిడార్లో సాఫ్ట్ వేర్ ఉద్యోగుల రవాణా అవసరాలకు అనుగుణంగా వాటిని నడిపించేలా ప్రణాళికలను రూపొందిస్తోన్నారు అధికారులు.
రాత్రివేళా..
రాత్రి వేళల్లో సిటీ బస్ సర్వీసులను మరింత పెంచాల్సి ఉంటుందని ప్రయాణికుల నుంచి విజ్ఞప్తులు అందుతోండటం దీనిపై ఎక్కువగా దృష్టి పెట్టే అవకాశాలు లేకపోలేదు. రాత్రివేళ కూడా ఉద్యోగులను క్షేమంగా ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చడానికి కొత్త బస్సులను వినియోగించాలని ప్రాథమికంగా నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఎంజీబీఎస్, జేబీఎస్, సికింద్రాబాద్, కాచిగూడ, శంషాబాద్ ఎయిర్ పోర్ట్ ప్రధాన పాయింట్లుగా శివార్లకు ఆయా బస్సులు రాకపోకలు సాగించవచ్చు.












Click it and Unblock the Notifications