‘కెసిఆర్-హరీశ్ రావుల మధ్య కోల్డ్వార్! అందుకే ఇరికిస్తున్నారు’
మెదక్: తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు, భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్ రావులపై సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. మల్లన్న సాగర్ ప్రాజెక్టు నిర్మాణం విషయంలో కేసీఆర్, హరీశ్ రావుల మధ్య కోల్డ్ వార్ నడుస్తోందని విమర్శించారు.
ముంపు గ్రామాల బాధితులకు బాసటగా తమ్మినేని చేపట్టిన పాదయాత్ర మెదక్ జిల్లా వేములగాట్ గ్రామానికి చేరుకున్న సందర్భంగా ఆయన మాట్లాడారు.
ఇద్దరు నేతలూ పరస్పర విరుద్ధ ప్రకటనలు చేస్తూ ప్రజలను అయోమయానికి గురి చేస్తున్నారని మండిపడ్డారు.

ముఖ్యమంత్రి భూ సేకరణ చట్టం 2013 ప్రకారం పరిహారం ఇస్తామని చెబుతుంటే.. హరీశ్ రావు 123 జీవోను వాడుకుంటామని చెబుతున్నారని అన్నారు. కేసీఆర్ను ఇరుకున పెట్టేందుకు హరీశ్ ప్రయత్నిస్తున్నారని తెలిపారు.
సెంట్రల్ వాటర్ కమిషన్ నుంచి అనుమతులు లేకుండా మల్లన్నసాగర్ ప్రాజెక్టును ఎలా నిర్మిస్తారని తమ్మినేని ప్రశ్నించారు. ప్రాజెక్టులో నీటి నిల్వ సామర్థ్యం తగ్గించడం ద్వారా ముంపు ప్రాంతాన్ని తగ్గించవచ్చన్న అంశాన్ని పరిశీలించాలని డిమాండ్ చేశారు.
ప్రాజెక్టుల పేరిట భూమిని సేకరించి, ఆపై రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడమే కేసీఆర్ ప్రధాన ఉద్దేశమని విమర్శించారు. 5లక్షల ఎకరాల సాగుభూమిని దౌర్జన్యంగా లాక్కుంటోందని ఆరోపించారు.












Click it and Unblock the Notifications