అవిశ్వాసానికి మద్దత్తు అంశంలో టీఆర్ఎస్ వెనక్కి తగ్గింది అందుకేనా...??
ఏపి టీడిపి ఎంపీలు పార్లమెంట్ లో ప్రవేశ పెట్టిన అవిశ్వాస తీర్మానం పట్ల టీఆర్ఎస్ ఎంపీలు ఆచితూచి అడుగులు వేస్తున్నారు. విభజన చట్టం లో ని హామీల అమలుకు కేంద్రతో పారాటానికి కలిసివస్తామని ఏపి ఎంపీలకు మాట ఇచ్చిన మరునాడే యూ టర్న్ తీసుకున్నారు గులాబీ ఎంపిలు. అవిశ్వాస తీర్మానం ఎందుకు ప్రవేశ పెట్టారో మాతో చర్చించలేదని వాఖ్యానించి ఏపి ఎంపీలను ఆత్మరక్షణలో పడేసారు. అవిశ్వాస తీర్మనం పై శుక్రవారం జరిగే చర్చలో టీఆర్ఎస్ పాల్గొంటుందా లేదా అనేది సస్పెన్స్ గా మారింది.
Recommended Video
ఏపి ఎంపీలు అవిశ్వాస తీర్మానం ఎందుకు ప్రవేశపెడుతున్నారో చర్చించలేదన్న టీఆర్ఎస్ ఎంపీలు..
ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా విషయంలో తెలంగాణ రాష్ట్ర సమితి పునరాలోచలో పడింది. విభజన చట్టంలో ఉన్న వాటికే మద్దతు ఇస్తామని.. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే తమ పరిశ్రమలు ఏపీకి వెళ్లే ప్రమాదం ఉందంటూ లోక్ సభలో టీఆర్ఎస్ ఉపనేత జి. వినోద్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. ప్రత్యేక హోదా ఇస్తారో..ఇవ్వరో తేల్చేయాలంటూ తెలంగాణ సీయం కేసీఆర్ వ్యాఖ్యానించారు. కెసీఆర్ కుమార్తె, ఎంపీ కవిత కూడా పలుమార్లు ఏపీకి ప్రత్యేక హోదాకు బహిరంగంగా మద్దతు ప్రకటించారు. కానీ ఇప్పుడు కేంద్రంపై తెలుగుదేశం పార్టీ పెట్టిన అవిశ్వాస తీర్మానానికి టీఆర్ఎస్ ఎంపీలు మాత్రం దూరంగా ఉన్నారు. పైగా కేంద్రంతో గొడవ పెట్టుకుంటే రాష్ట్రానికి వచ్చే నిధులు ఆగిపోతాయంటూ ఆ పార్టీ నేతలు బహిరంగంగా వ్యాఖ్యానిస్తున్నారు.
గులాబీ ఎంపీలతో టీడిపి ఎంపీల భేటీ బెడిసికొట్టిందా..??
గత సమావేశాల తరహాలోనే ఈ సమావేశాల్లోనూ అవిశ్వాస తీర్మానాలు తదితర మార్గాల ద్వారా కేంద్రంపై ఒత్తిడి చేసేందుకు టీడీపీ వ్యూహాత్మకంగా పావులు కదిపింది. టీఆర్ఎస్ తో పాటు దేశంలోని అన్ని పార్టీల నేతలను కలసి టీడీపీ ఎంపీలు మద్దతు కోరారు. దీని కోసం ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఓ లేఖను సిద్దం చేసి అన్ని పార్టీల నేతలకు ఈ లేఖను కూడా అందించారు. విభజన హామీల అమలు కు తాము టీఆర్ఎస్ మద్దతుకోరామని..దీనికి టీఆర్ఎస్ కూడా సానుకూలంగానే స్పందించిందని టీడిపి ఎంపి సుజనా చౌదరి రెండు,మూడు రోజుల క్రితం తెలియజేసారు కూడా.
మోదీని నొప్పించే ప్రయత్నం కేసీఆర్ కు నచ్చదు.. అందుకే యూ టర్న్..
విభజన హామీలు అమలు చేయకపోవటం వల్ల తెలుగు రాష్ట్రాల్లో పలు సమస్యలు వస్తున్నాయని, పార్లమెంట్ లో ఇచ్చిన హామీలను అమలు చేయాల్సిందేనని కేశవరావు వ్యాఖ్యానించారు. అయితే టీడీపీ ఎంపీలు టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కెసీఆర్ తో కాకుండా పార్లమెంటరీ పార్టీ నేత కేశవరావుతో సమావేశం కావటం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. టీఆర్ఎస్ అధినేత ఆమోదం లేకుండా కేశవరావు సొంతంగా నిర్ణయం తీసుకోలేరు కదా? అందునా కెసీఆర్ గత కొంత కాలంగా మోడీతో సన్నిహితంగా ఉంటున్న విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలో అవిశ్వాస తీర్మానం అంశంలో తమతో టీఆర్ఎస్ కలిసి నడుస్తుందా అనే అంశాన్ని ఖచ్చితంగా అంచనా వేయలేకపోయారు తెలుగు తమ్ముళ్లు.
ఆసక్తిగా గా అవిశ్వాస తీర్మాణం పరిణామాలు.. సూపర్ శుక్రవారం పై ఉత్కంఠ..
మోడీతో కలసి ముందుకువెళ్లేందుకే సిద్ధంగా ఉన్నట్లు స్పష్టమైన సంకేతాలు పంపుతోంది టీఆర్ఎస్. అయితే చంద్రబాబు నిర్ణయాన్ని వ్యతిరేకించటానికి మాత్రం ‘కాళేశ్వరం ప్రాజెక్టు'కు వ్యతిరేకంగా చంద్రబాబు లేఖ రాసిన అంశాన్ని టీఆర్ఎస్ ఎంపీలు తెరపైకి తెస్తున్నారు. గత కొంత కాలంగా కెసీఆర్ మోడీ సర్కారు విషయంలో సాఫ్ట్ కార్నర్ తోనే ముందుకెళుతున్నారు. ఇఫ్పుడు ఏకంగా ఏపీకి ప్రత్యేక హోదా విషయాన్ని టీఆర్ఎస్ బహిరంగంగా వ్యతిరేకించటం రాజకీయంగా కీలకంగా మారనుంది. త్వరలో ఎన్నికలు జరగనున్న తరుణంలో టీఆర్ఎస్ తీసుకున్న నిర్ణయం ఆ పార్టీకి లాభం చేస్తుందా? లేక నష్టం చేస్తుందా? అన్న అంశంపై ఇప్పుడు తర్జనభర్జనలు పడుతున్నట్టు తెలుస్తోంది.