రేవంత్రెడ్డికి, పొంగులేటికి మధ్య పెరుగుతున్న దూరం?
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి మధ్య దూరం పెరుగుతోందని జరుగుతున్న పరిణామాలు స్పష్టం చేస్తున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. రేవంత్ ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టినప్పటి నుంచి ఇటీవలి కాలం వరకు ఎప్పుడూ పొంగులేటి పక్కనే ఉండేవారు. ఒకరకంగా రెండో ముఖ్యమంత్రిగా పొంగులేటి ఉన్నారని అందరూ అనుకునేవారు. ఆయనకు కూడా సీఎం రేవంత్ అంత స్వేచ్ఛ ఇచ్చారు. అయితే క్రమేణా ఈ ఇద్దరు నేతల మధ్య దూరం పెరుగుతోందంటూ వార్తలు వచ్చాయి. ఇద్దరూ కలిసి కనిపించడం కూడా తగ్గింది. వీటికి బలం చేకూర్చేలా ఓ సంఘటన చోటుచేసుకుంది.
ముఖ్యమంత్రితో కలిసి వెళ్లని రెవెన్యూ మంత్రి
తాజాగా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు అనారోగ్యంగా ఉండటంతో పరామర్శించడానికి రేవంత్ బెంగళూరు వెళ్లివచ్చారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక గురించి, అభ్యర్థి గురించి చర్చించారు. రేవంత్ రెడ్డి తిరిగి వచ్చిన తర్వాత పొంగులేటి బెంగళూరు వెళ్లారు. సహజంగా ముఖ్యమంత్రితోపాటు మంత్రులు కూడా కలిసి వెళతారు. కానీ పొంగులేటి అలా వెళ్లకపోవడంపై కాంగ్రెస్ పార్టీలోనే గుసగుసలు ప్రారంభమయ్యాయి. పొంగులేటి శ్రీనివాసరెడ్డి ముఖ్యమంత్రితో ఉన్న సన్నిహితత్వాన్ని ఆసరా చేసుకొని దాన్ని దుర్వినియోగం చేస్తున్నారంటూ ఆ పార్టీ ఎమ్మెల్యేలే గతంలో ఆరోపణలు గుప్పించారు.

అప్పటి నుంచి తగ్గిన ప్రాధాన్యత
ఆ ఆరోపణలు వచ్చినప్పటి నుంచి రెవెన్యూ మంత్రి ప్రాధాన్యత తగ్గుతూ వచ్చింది. ఏ కార్యక్రమంలో కూడా ముఖ్యమంత్రితో కలిసి కనిపించడంలేదు. పొంగులేటి కూడా ఖర్గేతో రాజకీయాలు చర్చించివుంటారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతానికి రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా మాత్రం ఆయన రాజకీయం చేయరు. అధిష్టానం సీఎంకు గట్టి మద్దతుదారుగా ఉంది. అయితే భవిష్యత్తులో చోటుచేసుకోబోయే పరిణామాలు, స్థానిక సంస్థల ఎన్నికల్లో వచ్చే ఫలితాలు, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలాంటివాటిని బేరీజు వేసుకొని పొంగులేటి శ్రీనివాసరెడ్డి రాజకీయం మారే అవకాశం ఉండొచ్చనే అంచనాలు వెలువడుతున్నాయి. అయితే ఏం జరుగుతుందో తెలియాలంటే కొంతకాలం వేచిచూడక తప్పదు.












Click it and Unblock the Notifications