మూసీకి మహర్దశ ముహూర్తం ఫిక్స్.. శుభవార్త చెప్పిన సీఎం రేవంత్
మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టులో భాగంగా రెండేళ్లలోపే గోదావరి నీళ్లను గండిపేటకు చేర్చనున్నట్లు ముఖ్యమంత్రి ఎ.రేవంత్రెడ్డి స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించిన మొదటిదశ డీటైల్డ్ ప్రాజెక్టు నివేదిక సంక్రాంతి నాటికి సిద్ధమవుతుందని, ప్రాజెక్టు వ్యయంపై స్పష్టత వస్తుందని ఆయన శాసనసభకు వివరించారు. శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు ముఖ్యమంత్రి సమాధానమిచ్చారు.
మూసీ పునరుజ్జీవన ప్రాజెక్ట్ తో నైట్ ఎకానమీ: సీఎం రేవంత్
మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టు మొదటిదశకు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు 4 వేల కోట్ల రూపాయలకు పైగా రుణం అందించేందుకు సమ్మతించిందని పేర్కొన్నారు. మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టు కేవలం ప్రక్షాళన మాత్రమే కాదని, నదీ పరివాహ ప్రాంతంలో "నైట్ ఎకానమీ"ని అభివృద్ధి చేసే మంచి కార్యక్రమమని పేర్కొన్నారు. రక్షణ శాఖ కూడా ఈ ప్రాజెక్టుకు 55 ఎకరాల భూములను బదలాయించేందుకు ప్రాధమికంగా అంగీకరించిందని, మరో వంద ఎకరాలను కూడా రాష్ట్ర ప్రభుత్వం కోరుతోందని చెప్పారు.

మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టును ఐదు దశలుగా చేపట్టేందుకు అధ్యయనం
ఐదేళ్ల పాటు సేవలందించేందుకు మూడు అంతర్జాతీయ కంపెనీల కన్సార్షియమ్ తో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుందని, మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టును ఐదు దశలుగా చేపట్టేందుకు అధ్యయనం చేస్తున్నారని అన్నారు. మొదటి దశలో ఉస్మాన్ సాగర్ నుంచి బాపూఘాట్ వరకు, అలాగే హిమాయత్ సాగర్ నుంచి బాపూ ఘాట్ వరకు "వి" ఆకారంలో 21కిలోమీటర్ల పరివాహ ప్రాంతాన్ని మొదటిదశలో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నట్టు చెప్పారు.
మాది ఓపెన్ అజెండానే.. సీఎం చెప్పిందిదే
మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టు వల్ల సామాన్య ప్రజలకు, పేదలకు ఎలాంటి నష్టం జరగకుండా అత్యధిక పరిహారాన్ని ఇచ్చి, అత్యుత్తమ వసతులు కల్పిస్తూ, పునరావాసం కల్పించేందుకు, ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధంగా వుందని స్పష్టం చేశారు. ఈ విషయమై శాసనసభ్యులు తగిన సూచనలు, సలహాలు ప్రభుత్వానికి ఇవ్వాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. ఈ ప్రాజెక్టుపై ప్రభుత్వానిది ఓపెన్ అజెండానే తప్ప, ఏ అంశాన్ని దాచిపెట్టడంలేదని స్పష్టం చేశారు.
గండిపేట నుంచి గౌరెల్లి వరకు 55కిలోమీటర్ల ఎలివేటెడ్ కారిడార్
మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టుపై వచ్చే బడ్జెట్ సెషన్ సమయానికి శాసనసభ్యులకు మరింత స్పష్టత ఇవ్వనున్నట్లు వెల్లడించారు. కాగా, ఈ పథకంలో భాగంగా పాతనగరం సమీపంలోని మీరాలం ట్యాంక్ పై 450కోట్ల రూపాయలతో వంతెన నిర్మాణ పనులు చేపట్టినట్టు, ఈ పనులు రెండేళ్లలో పూర్తవుతాయని పేర్కొన్నారు. పాతనగరాన్ని ఒరిజినల్ నగరంగా పునరుద్ధరించనున్నట్లు పేర్కొన్నారు.గండిపేట నుంచి గౌరెల్లి వరకు 55కిలోమీటర్ల ఎలివేటెడ్ కారిడార్ ను నిర్మించనున్నట్లు ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఎట్టి పరిస్థితుల్లో మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టును చేపడతామని స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications