నష్టాన్ని పూడ్చాల్సిందే, లేదంటే సీఎస్ జైలుకే - కంచ గచ్చిబౌలిపై సుప్రీం..!!
సంచలనంగా మారిన కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంలో సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. పర్యావరణ నష్టం పూడ్చకపోతే సీఎస్ జైలుకు వెళ్లాల్సి ఉంటుందని ధర్మాసనం హెచ్చ రించింది. సీఎస్ తో పాటు కార్యదర్శులూ జైలుకు పోవాల్సి ఉంటుందని వ్యాఖ్యానించింది. లాంగ్ వీక్ ఎండ్ చూసి ఎందుకు చర్యలు చేపట్టారని అధికారులను అడిగింది. పర్యావరణానికి జరిగిన నష్టాన్ని పూడ్చాల్సిందేనని స్పష్టం చేసింది. పర్యావరణ అనుమతులు తీసుకున్నారో లేదో స్పష్టం చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై సర్వోన్నత న్యాయస్థానం గురువారం విచారణ జరిపింది. ఈ సందర్భంగా సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్ ధర్మాసనం కీలక వ్యాఖలు చేసింది. పర్యావరణ నష్టం పూడ్చకపోతే సీఎస్ జైలుకు వెళ్లాల్సి ఉంటుందని హెచ్చరించిన ధర్మాసనం హెచ్చరించింది. కాగా సీఈసీ దాఖలు చేసిన అఫిడవిట్పై కౌంటర్ వేసేందుకు కొంత సమయం కావాలని తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టును కోరింది. దీంతో జులై 23వ తేదీలోపు గతంలో ఉన్నట్లుగా అక్కడ పర్యావరణాన్ని పునరుద్ధరించాలని సుప్రీం ధర్మాసనం పేర్కొంటూ తదుపరి విచారణ జులై 23 వ తేదీకి వాయిదా వేసింది. అలాగే విద్యార్ధులపై తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన కేసులను ఉపసంహరించుకోవాలంటూ దాఖలైన ఐఏను సుప్రీంకోర్టు త్రోసి పుచ్చింది. ఆ విషయంలో ప్రత్యేకంగా మరో పిటీషన్ను దాఖలు చేయాలని, ఈ కేసులో కలపకూడదని ధర్మాసనం స్పష్టం చేసింది.

గత విచారణ సందర్భంగా పర్యావరణ వన్యప్రాణుల రక్షణకు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చెబుతూ.. నాలుగు వారాల్లోగా అఫిడవిట్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశించింది. అప్పటివరకు యధాస్థితి కొనసాగించాలని పేర్కొంది. ఈలోగా ఒక్క చెట్టు కూడా నరకడానికి ఒప్పుకోమని స్పష్టం చేసింది. విచారణ ప్రారంభంలోనే వివరాలను పరిశీలించిన సీజేఐ తెలంగాణ ప్రభుత్వంపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇష్టానుసారంగా డజన్ల కొద్దీ బుల్డోజర్లతో చెట్లు తొలగించేందుకు వినియోగించారని, ఇదంతా ముందస్తు పథకం ప్రకారమే చేసినట్టుగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పర్యావరణ అనుమతులు తీసుకున్నారా.. లేదా అన్నది స్పష్టం చేయాలన్నారు. జరిగిన నష్టాన్ని పూడ్చేందుకు తీసుకునే చర్యలను స్పష్టంగా చెప్పాలని జస్టిస్ గవాయ్ అన్నారు.












Click it and Unblock the Notifications