ఏ క్షణంలోనైనా హతమారుస్తామంటూ బెదిరించారు: బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్
హైదరాబాద్: తనను హతమారుస్తామంటూ గుర్తుతెలియని వ్యక్తి బెదిరింపులకు గురిచేస్తున్నారని భారతీ జనతా పార్టీ ఎమ్మెల్యే రాజాసింగ్ లోథ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ‘నువ్వు ఎక్కడున్నావ్? నిన్ను ఈ క్షణంలోనే హతమారుస్తాం. అందుకు అవసరమైన యంత్రాంగమంతా సిద్ధంగా ఉంది. నీ అంతు చూడటమే మా లక్ష్యం' అంటూ బెదిరింపులకు గురిచేశారని చెప్పారు.
ఆదివారం సాయంత్రం 6.52 నిమిషాలకు తనకు ఈ బెదిరింపు ఫోన్ కాల్ వచ్చిందని రాజాసింగ్ తెలిపారు. ఈ మేరకు బెదిరింపులు వచ్చాయని రాష్ట్ర డిజిపి, సిటీ పోలీస్ కమిషనర్కు ఫిర్యాదు చేశారు.
+ 101317482440 నంబర్ నుంచి వచ్చిన ఫోన్ కాల్కు సంబంధించిన డేటాను పోలీసు శాఖకు అందజేశానని, ఇంతవరకు ఎలాంటి స్పందన లేదని రాజాసింగ్ తెలిపారు. ఇప్పటి వరకు తనకు పదికిపైగా ఇలాంటి బెదిరింపు కాల్స్ వచ్చాయని, ఏ ప్రభుత్వం కూడా స్పందించడం లేదని చెప్పారు.
గతంలో పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్, ఇరాక్, ఇరాన్, ఇతర దేశాల నుంచి కూడా తనకు బెదిరింపు ఫోన్ కాల్స్ వచ్చాయని గుర్తు చేశారు. హిందూ ధర్మ రక్షణ, గోరక్ష కోసం ప్రాణత్యాగానికైనా సిద్ధమని రాజాసింగ్ స్పష్టం చేశారు.