విషాదం : పండగ గ్రాండ్గా జరుపుకోవాలనుకున్న కుటుంబం... స్వగ్రామానికి వెళ్తూ తిరిగిరాని లోకాలకు...
ఉగాది(ఏప్రిల్ 13) పండగ నేపథ్యంలో స్వగ్రామానికి వెళ్లి ఇతర కుటుంబ సభ్యులు,బంధుమిత్రులతో పండగ జరుపుకోవాలని ఆ కుటుంబం భావించింది. ఇందుకోసం ఉత్సాహంగా ఇంటి నుంచి కారులో బయలుదేరారు. కానీ మార్గమధ్యలో అనుకోని ప్రమాదం వారి జీవితాలను బలిగొన్నది. లారీని ఓవర్ టేక్ చేయబోయి డివైడర్ను ఢీకొట్టడంతో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు చనిపోయారు. జోగుళాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండల పరిధిలో ఈ ప్రమాద ఘటన చోటు చేసుకుంది.
కారులో బయలుదేరిన కుటుంబం...
ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లా పులివెందుల మండలం ఎర్రపల్లకు చెందిన మురళీమోహన్ రెడ్డి(45) భార్య సుజాత(40),కుమార్తె నేహారెడ్డి(12),కుమారుడు సూర్యతేజలతో కలిసి హైదరాబాద్లోని కూకట్పల్లిలో నివాసం ఉంటున్నారు. స్థానికంగా వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. మంగళవారం(ఏప్రిల్ 13) ఉగాది పండగ కావడంతో స్వగ్రామానికి వెళ్లి పండగ జరుపుకోవాలన్నారు. పండగకు అన్నదమ్ముల కుటుంబాలు కూడా స్వగ్రామానికి వస్తుండటంతో అంతా కలిసి ఘనంగా పండగ చేసుకోవాలనుకున్నారు.
లారీని ఓవర్ టేక్ చేయబోయి...
ఇదే క్రమంలో ఆదివారం(ఏప్రిల్ 11) ఉదయం మురళీ మోహన్ రెడ్డి ఫ్యామిలీ కారులో కడప జిల్లాలోని స్వగ్రామానికి బయలుదేరింది. అలా కారు గద్వాల జిల్లా ఇటిక్యాల మండలం ధర్మవరం స్టేజీ వద్దకు చేరుకోగా... లారీని ఓవర్ టేక్ చేయబోయి డివైడర్ను ఢీకొట్టింది. ఆపై అటుగా వెళ్తున్న బొలెరో వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు,బొలెరో వాహనం నుజ్జునుజ్జయ్యాయి. తీవ్ర గాయాలపాలైన మురళీ మోహన్ రెడ్డిని స్థానికులు ఆస్పత్రికి తరలించగా... అతను మార్గమధ్యలోనే మృతి చెందాడు.
ముగ్గురు మృతి
మురళీ మోహన్ రెడ్డి భార్య సుజాత,కుమార్తె నేహా రెడ్డిలు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. కుమారుడు సాయితేజా రెడ్డితో పాటు బొలెరోలో ప్రయాణిస్తున్న సునీల్,రాజు,సత్యం అనే ముగ్గురు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. స్థానిక పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. కారు అతివేగమే ప్రమాదానికి కారణమై ఉండొచ్చునని భావిస్తున్నారు. ఈ ప్రమాదంలో తల్లిదండ్రులు,సోదరిని కోల్పోవడంతో సూర్య తేజా రెడ్డి అనాథగా మిగిలిపోవడం విషాదం.