విప్లవోద్యమంలో భారీ కుదుపు... లొంగుబాటు యోచనలో మావోయిస్టు అగ్ర నేత...?
మావోయిస్టు అగ్ర నేత,సుదీర్ఘ కాలం మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శిగా పనిచేసిన గణపతి (74) లొంగుబాటు దిశగా ప్రయత్నాలు సాగిస్తున్నట్లు కథనాలు వస్తున్నాయి. ఇదే నిజమైతే మావోయిస్టు పార్టీ దశాబ్దంనర ప్రస్థానంలో దీన్ని భారీ కుదుపుగానే చెప్పాలి. వయో భారం,ఆరోగ్య సమస్యల రీత్యా ఆయన దండకారణ్యాన్ని వీడాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో ఇప్పటికే ఆయన ప్రభుత్వ వర్గాలకు తన లొంగుబాటు ప్రతిపాదనను చేరవేసినట్లు సమాచారం. దీనిపై ప్రభుత్వం ఒక నిర్ణయానికి రాగానే గణపతి తన లొంగుబాటును ప్రకటించే అవకాశం ఉంది. గణపతి లొంగుబాటు పట్ల మోదీ సర్కార్ కూడా సుముఖంగా ఉందని ఓ ప్రముఖ పత్రిక పేర్కొనడం గమనార్హం.

గణపతి నేపథ్యం...
గణపతి అసలు పేరు ముప్పాళ్ల లక్ష్మణరావు. జగిత్యాల జిల్లా బీర్పూర్ గ్రామానికి చెందిన ముప్పాళ్ల గోపాల్రావు-శేషమ్మ దంపతుల రెండో కుమారుడైన లక్ష్మణరావు 1949 జూన్ 16న జన్మించారు.పదో తరగతి వరకు జగిత్యాలలో, డిగ్రీ కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో చదివారు. కాలేజీ రోజుల్లో రాడికల్ స్టూడెంట్ యూనియన్(RSU)తో కలిసి పనిచేశారు. 1972లో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా ప్రస్తుత కరీంనగర్,పెద్దపల్లి జిల్లాల్లో పనిచేశారు.1976లో చందుర్తి మండలం రుద్రంగిలో పనిచేస్తున్నప్పుడు బీఈడీలో సీటు రావడంతో వరంగల్ వెళ్లారు.

ఆర్ఎస్యూ నుంచి విప్లవోద్యమంలోకి...
వరంగల్ వెళ్లిన తర్వాత లక్ష్మణరావు తిరిగి ఆర్ఎస్యూలో యాక్టివ్ అయ్యారు. అలా క్రమంగా విప్లవోద్యమ బాట పట్టారు.1977లో జగిత్యాల జైత్రయాత్రకు హాజరైన ఆయన... ఆ తర్వాత హత్య కేసుల్లో ఆరోపణలతో అజ్ఞాతంలోకి వెళ్లారు. 1980లో కొండపల్లి సీతారామయ్య నాయకత్వంలో ఏర్పాటైన పీపుల్స్ వార్లో చేరి కీలక పాత్ర పోషించారు. 1992లో పీపుల్స్ వార్ నాయకత్వ బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాతి కాలంలో ఎంసీసీ(మావోయిస్ట్ కమ్యూనిస్ట్ సెంటర్)తో చర్చలు జరిపి... దేశవ్యాప్తంగా ఉన్న నక్సల్ పార్టీలు,గెరిల్లా దళాలన్నింటిని ఒకే గొడుగు కిందకు చేర్చి మావోయిస్టు పార్టీని ఏర్పాటు చేశారు.

సుదీర్ఘ కాలం కేంద్ర కమిటీ కార్యదర్శి
2004 సెప్టెంబరు 21న ఏర్పాటైన మావోయిస్టు పార్టీ ఏర్పాటైన నాటి నుంచి 14 ఏళ్ల సుదీర్ఘ కాలం కేంద్ర కమిటీ కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు. ఛత్తీస్గడ్లో సమాంతర జనతన సర్కారును నడిపించారు. మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు అయిన గణపతిపై పలు ప్రభుత్వాలు భారీ రివార్డులు ప్రకటించాయి. రెండేళ్ల క్రితం అనారోగ్య సమస్యలతో మావోయిస్ట్ కేంద్ర కమిటీ కార్యదర్శిగా గణపతి తప్పుకున్నారు. ఆయన స్థానంలో నంబాల కేశవరావు బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం అనారోగ్య సమస్యలు తీవ్రమవడంతో గణపతి లొంగిపోవాలని నిర్ణయించుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.












Click it and Unblock the Notifications