అమ్మఒడి తరహాలో మరో పధకం - ఉచిత మెట్రో ప్రయాణం..!
తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ వ్యూహాత్మక అడుగులు వేస్తోంది. ఈ సారి ఎలాగైనా అధికారం దక్కించుకోవాలనే పట్టుదలతో ఉంది. ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోవటానికి సిద్దంగా లేదు. ఆరు గ్యారెంటీ పథకాలతో ప్రజలను తమ వైపు తిప్పుకొనే ప్రయత్నం చేస్తున్న కాంగ్రెస్..ప్రత్యేకంగా అర్బన్ ఓటర్లను ఆకట్టుకొనే విధంగా మేనిఫెస్టో రూపకల్పన చేస్తోంది. ఏపీలో అమలు చేస్తున్న అమ్మఒడి తరహాలో కొత్త పథకానికి రూప కల్పన చేస్తోంది. విద్యార్ధినులకు మెట్రోలో ఉచిత ప్రయాణం హామీకి సిద్దమైంది.
కీలక హామీలతో : తెలంగాణలో కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో కీలక హామీల ప్రకటనకు కసరత్తు జరుగుతోంది. 14 ఏళ్లు నిండి చదువుకుంటున్న బాలికలందరికీ మెట్రో ప్రయాణం ఉచితంగా చేస్తామని ప్రకటించేందుకు నిర్ణయం తీసుకుంది. పదోతరగతి నుంచి పీహెచ్డీలు చేసే విద్యార్దుల వరకు అన్ని స్థాయిలోని వారికి ఈ అవకాశం కల్పించేలా పధకం రూపకల్పన చేస్తున్నారు. అన్ని వర్గాల ఓటర్లను ఆకట్టుకొనే విధంగా ప్రజాకర్షకంగా మేనిఫోస్టోకు తుది రూపు ఇస్తున్నారు. ఈ నెల 14న లేదా 15న ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేయాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఏపీలో మహిళలను బాగా ఆకర్షించి..వైసీపీకి ఓట్లు తెచ్చిన అమ్మఒడి తరహాలోనే తెలంగాణలో కొత్త పథకం పైన కాంగ్రెస్ కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.

అన్ని వర్గాలను ఆకట్టుకొనేలా : అయితే, ఏపీ తరహాలో కాకుండా రూ వెయ్యి వరకు ఆర్దిక సాయం చేయాలనే ప్రతిపాదన పైన చర్చ సాగుతున్నట్లు సమాచారం. అదే విధంగా స్థానిక సంస్థల వార్డు మెంబర్లకు నెలకు రూ 15 వేల గౌరవ వేతనం ఇస్తామనే హామీని ఇచ్చేందుకు కాంగ్రెస్ సిద్దం అవుతోంది. ప్రత్యేకంగా హైదరాబాద్ ఓటర్ల పైన కాంగ్రెస్ ఫోకస్ చేసింది. నగరంలోని ట్రాఫిక్ నియంత్రణపై ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తోంది. హైదరాబాద్ తో పాటుగా రాష్ట్రంలోని ప్రజలందరికీ ఆకర్షణీయంగా ఉండేలా వాహన చలాన్లను ఏకకాలంలో రద్దు చేస్తామని ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. హైదరాబాద్ చుట్టూ నాలుగు వైపులా కార్పోరేట్ ఆస్పత్రులు..వరదల తాకడి నుంచి బయట పడేందుకు లింక్డ్ కెనాల్స్ వంటి ఏర్పాటు ప్రతిపాదనలో పాటుగా మూసీ ప్రక్షాళన అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించనున్నట్లు తెలుస్తోంది.

ఈ నెల 14 లేదా 15న ప్రకటన : మూసీ చుట్టూ రేడియల్ రోడ్ల నిర్మాణం..నల్గొండ జిల్లా వరకు మూసీ కనెక్టివిటీ కారిడార్ వంటి ఏర్పాటు అంశాలు మేనిఫెస్టోల ప్రతిపాదించే అవకాశం ఉంది. వీటితో పాటుగా ఉద్యోగులు ఎంతో కాలంగా డిమాండ్ చేస్తున్న సీపీఎస్ రద్దు అంశం పైన స్పష్టమైన హామీ ఇచ్చేలా కసరత్తు జరుగుతోంది. అదే విధంగా ఆరు గ్యారంటీల ద్వారా ఇప్పటికే కాంగ్రెస్ ముమ్మరంగా ప్రచారం సాగిస్తోంది. వీటికి అదనంగా తాము అధికారంలోకి వస్తే అన్ని వర్గాల ప్రజలకు ఎటువంటి మేలు చేస్తాము... హైదరాబాద్ నగరంలో ప్రజా సమస్యల పరిష్కారానికి ఏం చేయబోతున్నామనేది ఈ మేనిఫెస్టో ద్వారా స్పష్టత ఇచ్చేందుకు కాంగ్రెస్ నేతలు తమ మేనిఫెస్టోకు తుది రూపు ఇస్తున్నారు.












Click it and Unblock the Notifications