భర్త అంత్యక్రియల్లో పోకిరి లెవెల్ ట్విస్ట్ ఇచ్చిన భార్య
నిర్మల్ జిల్లా, సోన్ మండలం, వెల్మల్ గ్రామంలో నాగలక్ష్మి అనే మహిళ తన అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడని భావించి భర్త హరిచరణ్ను అత్యంత కిరాతకంగా చంపేసింది. బైంసా ఏఎస్పీ రాజేష్ మీనా తెలిపిన వివరాల ప్రకారం, 30 ఏళ్ల క్రితం హరిచరణ్ను పెళ్లాడిన నాగలక్ష్మికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే, అదే గ్రామానికి చెందిన అంకం మహేష్తో ఆమె వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ విషయం భర్తకు తెలియడంతో తరచుగా గొడవలు జరుగుతుండేవి. తన కొడుకు కృష్ణకు ఈ విషయం చెబుతానని భర్త బెదిరించడంతో, నాగలక్ష్మి భర్తను చంపేయాలని నిర్ణయించుకుంది.
జూలై 22న అర్ధరాత్రి, ప్రియుడు మహేష్ను ఇంటికి పిలిపించుకొని, గాఢ నిద్రలో ఉన్న భర్త హరిచరణ్ గొంతును టవల్తో నులిమి చంపేశారు. అనంతరం ఎవరికీ అనుమానం రాకుండా మృతదేహాన్ని బాత్రూమ్లో పడేసి, ఫిట్స్ వచ్చి చనిపోయాడని చెప్పింది. స్థానికులు అతన్ని ఆసుపత్రికి తరలించినా, అప్పటికే మరణించాడని వైద్యుడు ధృవీకరించారు. అయితే, డాక్టర్కు అనుమానం వచ్చినా పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. దుబాయ్ లో ఉన్న కొడుకు కృష్ణకు తండ్రి మరణవార్త తెలియజేయడంతో, అతను హుటాహుటిన ఇంటికి బయలుదేరాడు.

కొడుకు వచ్చేలోపే, నాగలక్ష్మి హరిచరణ్ అంత్యక్రియలు పూర్తి చేయించింది. మూడు రోజుల తర్వాత కర్మకాండల సమయంలో, బంధువులు బొట్టు, గాజులు తీసేయమని చెప్పగా నాగలక్ష్మి నిరాకరించింది. దీంతో కొడుకు కృష్ణకు అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసుల విచారణలో నాగలక్ష్మి నేరం ఒప్పుకుంది. దీంతో పోలీసులు ఆమెను, ఆమె ప్రియుడు మహేష్ను అరెస్టు చేసి రిమాండ్కు పంపించారు. ఈ ఘటన స్థానికులను, కుటుంబ సభ్యులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.












Click it and Unblock the Notifications