వైఎస్ షర్మిలపై సంచలన ఆరోపణలు -బద్దలు కొట్టి ఎత్తుకెళతారన్న గంగుల -కేసీఆర్ వ్యూహం ఇదేనా?
తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీకి ధీటుగా బీజేపీ బలపడుతోన్న వేళ.. కొత్త పార్టీతో వైఎస్ షర్మిల కొత్త రాజకీయ సమీకరణాలకు తెరలేపారు. కాంగ్రెస్, బీజేపీలకు చెందిన పలువురు ప్రముఖులు తెలంగాణలో షర్మిల ఎంట్రీపై విమర్శలు గుప్పిస్తుండగా.. టీఆర్ఎస్ మాత్రం వ్యూహాత్మక మౌనం పాటిస్తూ వచ్చింది. షర్మిలపై కామెంట్లు కూడదంటూ ప్రగతి భవన్ నుంచి ఆదేశాలు జారీ అయినట్లు కూడా వార్తలొచ్చాయి. అయినాసరే, కేసీఆర్ కు అత్యంత ఆప్తులుగా ముద్రపడిన మంత్రులు కొందరు షర్మిలపై మాటల బాణాలు వదులుతూనే ఉన్నారు. తాజాగా..
చంద్రబాబు అడుగుల్లో వైఎస్ షర్మిల -కేసీఆర్కు దిమ్మతిరిగేలా స్ట్రాటజీ -కోటి ఎకరాలు వైఎస్ ఖాతాలోకి
షర్మిలపై గంగుల సంచలనం..
కరీనంగర్ జిల్లా టీఆర్ఎస్ ముఖ్యుడు, రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్ మంగళవారం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో మాట్లాడుతూ.. వైఎస్ షర్మిల కొత్త పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. షర్మిల కొత్త పార్టీ ఎందుకు పెడుతున్నదో కారణాలను వివరిస్తూ.. ఆమెను అడ్డుకోడానికి తెలంగాణ సమాజం ఏం చేయాలో గంగుల వివరించారు. తెలంగాణలో వైసీపీకే అభిమానులు లేరని, అలాంటప్పుడు షర్మిలకు ఎక్కడి నుంచి వస్తారని, రాయలసీమ ఫ్యాక్షన్ కుయుక్తులు ఇక్కడ చెల్లబోవంటూ గత వారం కామెంట్లు చేసిన మంత్రి గంగుల.. మంగళవారం నాటి ప్రెస్ మీట్ లో ఇంకాస్త డోసు పెంచారు. మంత్రి ఏమన్నారో ఆయన మాటల్లోనే..
కడుపులో మంటతో ఎంట్రీలు..
''సుదీర్ఘ పోరాటం తర్వాత 2014లో మనకు తెలంగాణ వచ్చింది. కేసీఆర్ ముఖ్యమంత్రి అయి ఆరేళ్లైనా గడిచిందో లేదో.. మళ్లీ ఆంధ్రా శక్తులు పురివిప్పుతున్నాయి. వాళ్లు 70 ఏళ్లు పాలించి, మనను అన్ని రకాలుగా వంచించారు. ఇప్పుడు మనకు నీళ్లు, కరెంటు వచ్చే సరికి వాళ్ల కడుపుల్లో మంట మొదలైంది. జగనన్న బాణాన్ని అంటూ షర్మిలక్క ఎంట్రీ ఇస్తున్నది ఎందు కోసం? మన నీళ్లు, కరెంటును దోచుకుపోవడానికి కాదా? ఇవాళ జగనన్న బాణం షర్మిల వచ్చింది. రేపు జగనన్నే దిగుతాడు. ఆ వెంటనే చంద్రబాబు కూడా వచ్చేస్తాడు. ఇంకేముంది.. తెలంగాణలో మళ్లీ కొట్టాటలు మొదలవుతాయి. వీటి నుంచి...
ప్రాజెక్టులు బద్దలు కొట్టేస్తారు..
బాణాలుగా దూసుకొస్తోన్న ఆంధ్రా శక్తుల నుంచి తెలంగాణను కాపాడే ఏకైక రక్షకుడు కేసీఆర్ ఒక్కడే. అందుకే టీఆర్ పార్టీని బతకనీయాలి. ఈ రాష్ట్రాన్ని కాపాడే ఏకైక పార్టీ టీఆర్ఎస్ మాత్రమే. ఒకవేళ కేసీఆర్, టీఆర్ఎస్ పార్టీగానీ లేకపోతే మళ్లీ ఆంధ్రా శక్తులు అందరూ వచ్చి.. తెలంగాణను కబ్జా చేసి.. ఉన్న నీళ్లను ఎత్తుకెళ్తారు.. ఈ జగనన్న బాణం షర్మిల వస్తే ఇక్కడ నీళ్లుంటాయా? ఎల్లంపెల్లి, మేడిగడ్డ ప్రాజెక్టులను ఉంచుతరా? వాటిని పలగొట్టి మీరీ వీళ్లు నీళ్లు తీసుకుపోరా? కాబట్టే..
ఇంటి పార్టీని కాపాడటం బాధ్యత..
టీఆర్ఎస్ పార్టీని, కేసీఆర్ నాయకత్వాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత తెలంగాణ ప్రజలపై ఉంది. కేసీఆర్ లేకపోతే మళ్లీ షర్మిల, జగన్, చంద్రబాబులు వచ్చిపడతారు. ఆ తర్వాత తెలంగాణ పోయి, మళ్లీ సమైక్య రాష్ట్రం వస్తుంది. ఆ కుట్రల నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవాలి. ఇంటి పార్టీని మరింతగా బలపర్చాలి. ఢిల్లీ కేంద్రంగా పనిచేసే కాంగ్రెస్, బీజేపీలు మన పార్టీలు కావు. హైదరాబాద్ నడిబొడ్డున ఉండే టీఆర్ఎస్ ఒక్కటే మనకు అండ. మన కోసం కాకున్నా మన బిడ్డల భావి తరాల కోసమైనా టీఆర్ఎస్ ను పలపర్చండి..'' అని మంత్రి గంగుల కమలాకర్ చెప్పుకొచ్చారు.
షర్మిల పార్టీపై కేసీఆర్ వ్యూహం ఇదేనా?
తెలంగాణలో షర్మిల కొత్త పార్టీ వ్యవహారంపై టీఆర్ఎస్ ఇప్పటివరకు అధికారికంగా స్పందించలేదు. మంత్రులు మాత్రం తరచూ విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. మంత్రి ఈటల రాజేందర్ ఇటీవలే షర్మిల పార్టీపై మత కోణంలో పరోక్ష విమర్శలు చేశారు. తెలంగాణ రైతులకు ఏరకంగా అన్యాయం జరిగిందో చెప్పాలని మరో మంత్రి హరీశ్ రావు.. షర్మిల పార్టీని నిలదీశారు. ఇప్పుడు మంత్రి గంగుల కమలాకర్ ఏకంగా షర్మిల పార్టీని ఆంధ్రా భూతంగా చిత్రీకరించే ప్రయత్నంచేశారు. ఈ పరిణామాలన్నీ పరోక్షంగా కేసీఆర్ స్ట్రాటజీని వెల్లడిస్తున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో టీఆర్ఎస్ కు హోరాహోరీ పోరు తప్పని పరిస్థితుల్లో.. కాంగ్రెస్-టీడీపీలు జత కట్టడం, తెలంగాణలో ప్రచారానికి చంద్రబాబు సైతం సిద్ధం కావడం టీఆర్ఎస్ కు లాభించింది. కాంగ్రెస్ కు ఓట్లేస్తే చంద్రబాబుకు వేసినట్లేనని, తద్వారా ఆంధ్రా శక్తులు మళ్లీ పుంజుకుంటాయని కేసీఆర్ ప్రచారం చేశారు. చంద్రబాబు ద్వారా లబ్దిపొందామని పరోక్షంగా అంగీకరించిన కేసీఆర్.. బాబుకు రిటర్న్ గిప్టు కూడా ఇస్తామన్నారు. ఇప్పుడు బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్ అన్నట్లుగా సాగుతోన్న రాజకీయాల్లో షర్మిల ఎంట్రీ ద్వారా మళ్లీ 'ఆంధ్రా బూచి'ని ప్రచారాస్త్రంగా టీఆర్ఎస్ వాడుకోబోతోందని మంత్రుల వ్యాఖ్యలతో తేటతెల్లం అవుతోంది.
ఆ ఒక్కమాటతో మేయర్ ప్రతిష్ట మూసీలోకి -'వర్షాలు కాదురా నాయనా.. వరదలు' అంటూ డ్యామేజ్ కంట్రోల్