ఎమ్మెల్యేలకు ఎర కేసులో నిందితులకు షాక్: బెయిల్ పిటిషన్ కొట్టేసిన ఏసీబీ కోర్టు
హైదరాబాద్: టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఎర కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితుల బెయిల్ పిటిషన్ను ఏసీబీ కోర్టు కొట్టివేసింది. దర్యాప్తు సమయంలో బెయిల్ మంజూరు చేస్తే ఆటంకం ఎదురవుతుందని పోలీసుల తరపున న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
న్యాయవాది వాదనతో ఏకీభవించిన ఏసీబీ ప్రత్యేక కోర్టు బెయిల్ పిటిషన్ను కొట్టివేసింది. ఎమ్మెల్యేల ఎర కేసులో నిందితులుగా ఉన్న రామచంద్రభారతి, నందకుమార్, సింహయాజి ప్రస్తుతం చంచల్గూడ జైలులో రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు.
ఇది ఇలావుండగా, ఎమ్మెల్యేలకు ఎర కేసులో విచారణను హైకోర్టు మంగళవారానికి వాయిదా వేసింది. కేసు దర్యాప్తుపై విధించిన స్టేను ఎత్తివేస్తూ సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ బీజేపీ ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి హైకో సీజే బెంచ్ ను శనివారం ఆశ్రయించిన విషయం తెలిసిందే. స్టేను యథాతథంగా కొనసాగించేలా ఆదేశాలివ్వాలని, సీబీఐ లేదా ప్రత్యేక దర్యాప్తు సంస్థతో విచారణ జరిపించాలని ఆయన కోర్టును కోరారు. దీనిపై అత్యవసరంగా పరిపించాలని ప్రేమేందర్ తరపు న్యాయవాది సోమవారం కోర్టును కోరారు. అయితే, మంగళవారం విచారణ చేపడతామని హైకోర్టు స్పష్టం చేసింది.
మరోవైపు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఎర కేసులో బెయిల్ మంజూరుపై నిందితులు సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్పై విచారణ సోమవారానికి వాయిదా పడింది. నిందితుల తరపున వాదిస్తున్న న్యాయవాది సోమవారం స్థానిక కోర్టులో బెయిల్ పిటిషన్పై నిర్ణయం వెలువడనున్నట్లు న్యాయస్థానానికి తెలిపారు. దీంతో విచారణను శుక్రవారానికి వాయిదా వేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. దీనిని పరిశీలించిన జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ విక్రమ్ నాథ్లతో కూడిన ధర్మాసనం తదుపరి విచారణను సోమవారానికి వాయిదావేసింది.