లాయర్ ప్రతాప్ గౌడ్ను 8 గంటపాటు విచారించిన సిట్: కీలక సమాచారం సేకరణ
హైదరాబాద్: టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఎర కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) దర్యాప్తును కొనసాగిస్తోంది. శుక్రవారం న్యాయవాది ప్రతాప్ గౌడ్, నందకుమార్ భార్య చిత్రలేఖను ప్రశ్నించింది సిట్. తాజాగా, శనివారం ప్రతాప్ ను 8 గంటలపాటు విచారించింది. ఆర్థిక లావాదేవీల వివరాలపై ప్రశ్నించారు.
రామచంద్ర భారతి, సింహయాజీ, నందకుమార్ ఖాతాల నుంచి నగదు బదిలీపై సిట్ ఆరా తీసింది. గతంలో నందకుమార్ అంబర్పేటలో హోటల్ నిర్వహించగా.. అదే ప్రాంతానికి చెందిన ప్రతాప్ అతనికి భారీగా డబ్బు ఇచ్చినట్లు సిట్ అధికారులు సమాచారం సేకరించారు.
నిందితులు కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో కీలక పదవి ఇప్పిస్తామని నమ్మించడంతో భారీగా డబ్బు ఇచ్చానని ప్రతాప్ గౌడ్ అంగీకరించినట్లు తెలిసింది. ఆ విషయంలో నిందితులకు, ప్రతాప్ గౌడ్ కు మధ్య జరిగిన సంభాషణలు లభ్యమైనట్లు సమాచారం. ప్రతాప్ గౌడ్ ఫోన్లోంచి వాటిని రికార్డు కావడంతో ఆధారాల నిమిత్తం సిట్ స్వాధీనం చేసుకుంది.
రామచంద్ర భారతి, సింహయాజీ, నందకుమార్ తో ప్రతాప్ పలు పలు ప్రయాణాలు చేసినట్లు కూడా అధికారులు గుర్తించినట్లు సమాచారం. ప్రతాప్ స్టేట్మెంట్ను రికార్డు చేశారు అధికారులు. మరోవైపు, నందకుమార్ భార్య చిత్రలేఖను సోమవారం మరోసారి విచారణకు హాజరుకావాలని అధికారులు ఆదేశించారు.