టీఆర్ఎస్ ఎమ్మెల్సీ సురభి వాణీ దేవికి కరోనా పాజిటివ్...
టీఆర్ఎస్ ఎమ్మెల్సీ సురభి వాణీదేవి కరోనా బారినపడ్డారు. ఆదివారం(మార్చి 28) ఆమె వైద్య పరీక్షలు చేయించుకోగా కరోనా పాజిటివ్గా తేలింది. ఈ విషయాన్ని సురభి వాణీదేవి సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.
'టీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు, నాయకులకు, కార్యకర్తలకు, ప్రజలకు నా మనవి. నాకు కోవిడ్ పాజిటివ్గా నిర్దారణ అయినందున గత కొన్ని రోజులుగా నాతో ప్రైమరీ కాంటాక్ట్లో ఉన్న వారు హోమ్ ఐసోలేషన్ తో పాటు అవసరమైతే కోవిడ్ పరీక్షలు చేయించుకోవాల్సిందిగా కోరుతున్నాను..' అని ట్విట్టర్ ద్వారా తెలిపారు.
తెలంగాణలో ఇటీవల పలువురు ప్రజాప్రతినిధులు కరోనా బారినపడిన సంగతి తెలిసిందే. మంత్రి సత్యవతి రాథోడ్,ఎమ్మెల్సీలు పురాణం సతీశ్,దామోదర్ రెడ్డిలు ఇటీవల కరోనా బారినపడ్డారు.
గడిచిన 24 గంటల్లో తెలంగాణలో మొత్తం 57,942 కరోనా పరీక్షలు నిర్వహించగా కొత్తగా 535 కరోనా కేసులు నమోదయ్యాయి. మరో ముగ్గురు కరోనాతో మృతి చెందారు. కొత్తగా నమోదైన కేసుల్లో ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలోనే 154 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 4,495 యాక్టివ్ కేసులు ఉండగా... ఇందులో 1,979 మంది హోం ఐసోలేషన్లో చికిత్స పొందుతున్నారు. మిగిలిన వారు వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
కరోనా విజృంభన నేపథ్యంలో ప్రభుత్వం బహిరంగ ఉత్సవాలు,ఊరేగింపులు,సమావేశాలపై ఏప్రిల్ 30 వరకు నిషేధం విధించిన సంగతి తెలిసిందే. షబ్-ఏ-రాత్, హోలి, ఉగాది, శ్రీరామనవమి, మహావీర్ జయంతి, గుడ్ఫ్రైడే, రంజాన్ తదితర మతపరమైన కార్యక్రమాల సందర్భంగా బహిరంగంగా ఎలాంటి ఉత్సవాలు, ర్యాలీలు నిర్వహించరాదని ఆదేశించింది. నిబంధనలు అతిక్రమించేవారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
టీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు, నాయకులకు, కార్యకర్తలకు, ప్రజలకు నా మనవి. నాకు కోవిడ్ పాజిటివ్ గా నిర్దారణ అయినందున గత కొన్ని రోజులుగా నాతో ప్రైమరీ కాంటాక్ట్ ఉన్న వారు హోమ్ ఐసోలేషన్ తో పాటు అవసరమైతే కోవిడ్ పరీక్షలు చేయించుకోవాల్సిందిగా కోరుతున్నాను.
— Surabhi Vani Devi (@SurabhiVaniDevi) March 28, 2021
కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించింది. కరోనాను అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాల చర్యలు చేపడుతోందని తెలిపింది. ప్రతి ఒక్కరూ భౌతిక దూరం పాటిస్తూ మాస్కులు ధరించాలని కోరింది. ఈ మేరకు సీఎస్ సోమేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. నిబంధనలు తప్పనిసరిగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్లను, ఎస్పీలను ఆదేశించారు.