వరంగల్ టిఆర్ఎస్ అభ్యర్థి దయాకర్: రవికుమార్కు కెసిఆర్ బుజ్జగింపులు
హైదరాబాద్: వరంగల్ లోక్సభ స్థానానికి తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) అభ్యర్థిగా పసునూరి దయాకర్ పేరు ఖరారు చేశారు. తనకే టికెట్ దక్కుతుందని చివరి వరకు ఆశతో ఉన్న గుడిమళ్ల రవికుమార్కు ఎదురుదెబ్బ తగిలింది. వివిధ సమీకరణలు పరిగణనలోకి తీసుకున్న అనంతరం దయాకర్కు పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు టికెట్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
పార్టీ ఆవిర్భావం నుంచి సాధారణ కార్యకర్తగా పనిచేసిన పసునూరి దయాకర్ ప్రస్తుతం పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నారు. గత రెండు ఎన్నికల్లో వర్ధన్నపేట నియోజకవర్గానికి ఇన్చార్జిగా పనిచేశారు. వరంగల్ జిల్లా సంగెం మండలం బొల్లికుంట గ్రామానికి చెందిన పేద దళిత కుటుంబంలో జన్మించిన దయాకర్ 2001లోనే టీఆర్ఎస్లో చేరారు.
వరంగల్ టికెట్ రాకపోవడంతో గుడిమళ్ల రవికుమార్ తన సన్నిహితుల దగ్గర తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. మొదట నుంచి టికెట్ తనకే వస్తుందని కెసిఆర్ చెప్పారనీ, ఇప్పుడు తనకి కాకుండా వేరేవారికి ఇవ్వడం ఎంత వరకు న్యాయమని ఆవేదన చెందారు. ఈ విషయం తెలుసుకున్న కేసీఆర్ రవికుమార్ను బుజ్జగించారు. కీలక పదవి ఇస్తానని హామీ ఇచ్చారు.
సామాజిక సమీకరణాలు, స్థానిక సమీకరణాల కారణంగా రవికుమార్ స్థానంలో పసునూరి దయాకర్ పేరు తెరపైకి వచ్చింది. అభ్యర్థిని అధికారికంగా ప్రకటించటానికి ముందు సీఎం జిల్లా నాయకులు, పార్టీ ముఖ్యులతో మరోసారి సమావేశమై విపులంగా చర్చించారు. చివరకు దయాకర్ పేరు ఖరారు చేశారు. రవికుమార్ ఎలాంటి నిరాశకు గురికావలిన అవసరం లేదని, పార్టీపరంగా-ప్రభుత్వపరంగా ప్రముఖపాత్ర కల్పిస్తాననీ, ఏదైనా మంచి పోస్టు ఇస్తాననీ ముఖ్యమంత్రి ఆయనకు భరోసా ఇచ్చారు.
2009లో ఉద్యమ అవసరాల రీత్యా మాజీ మంత్రి జీ విజయరామారావుకు, 2014లో ప్రస్తుత ఎమ్మెల్యే అరూరి రమేశ్కు టిక్కెట్ ఇచ్చినా అధినేత నిర్ణయాన్ని శిరసావహించి వారి గెలుపునకు కృషి చేశారు. ఇతర పార్టీలు రెచ్చగొట్టేందుకు యత్నించినా పార్టీ వైపే నిలబడ్డారు.