Weather: తెలంగాణలో రాగల మూడురోజులపాటు వర్షాలు, కొనసాగనున్న చలి తీవ్రత
హైదరాబాద్: గత కొద్ది రోజులుగా తెలంగాణలో ఉష్ణోగ్రతలు కాస్త పెరిగాయి.. చలి తీవ్రత కూడా కాస్త తగ్గుముఖం పట్టింది. అయితే, వచ్చే మూడు రోజుల పాటు తెలంగాణలో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.
Recommended Video
రాష్ట్రంలో కొన్నిచోట్ల ఆదివారం నుంచి మంగళవారం వరకు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అకాల వర్షాలతోపాటు ఉరుములు, మెరుపులు కూడా వచ్చే అవకాశం ఉందని అంచనా వేసింది.
ఆదివారం నాడు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణశాఖ అధికారులు తెలిపారు. వాయువ్య భారతం నుంచి తక్కువ ఎత్తులో గాలులు తెలంగాణ వైపు వీస్తున్నాయి. దీని ప్రభావంతో ఆదివారం నాడు తెలంగాణలో అక్కడక్కడా మోస్తరు వర్షాలు కురుస్తాయని అధికారులు పేర్కొన్నారు.
ఇక రాష్ట్రంలో నిన్నటి నుంచి కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. రాత్రివేళ ఉష్ణోగ్రతలు మరింత పడిపోతున్నాయి. దీంతో చలి తీవ్రత పెరిగి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాగా, రాష్ట్రంలో శుక్రవారం నాడు అత్యల్పంగా నిర్మల్ జిల్లా తానూర్ లో 10.9 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు అయింది.
ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లో చలి తీవ్రత అధికంగా ఉంది. మరో 20 రోజుల పాటు చలి తీవ్రత కొనసాగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక హైదరాబాద్ నగరంలోనూ ఉదయం, రాత్రివేళలో చలి తీవ్రత ఎక్కువగానే ఉంటోంది. ఉదయం పది దాటినా ఎండ తగలడం లేదు. చలి తీవ్రతకు నగరవాసులు ఇబ్బంది పడుతున్నారు.