Huzurabad: చిక్కుల్లో ఈటల... ఆయన బావమరిదిని అరెస్ట్ చేయాలంటూ డీజీపీకి ఫిర్యాదు...
మాజీ మంత్రి ఈటల రాజేందర్ సతీమణి సోదరుడు,ఆయన బావమరిది కొండవీటి మధుసూదన్ రెడ్డిపై టీఎస్ జీసీసీ(తెలంగాణ స్టేట్ గిరిజన కోపరేటివ్ కార్పోరేషన్) ఛైర్మన్ ధరావత్ మోహన్ గాంధీ డీజీపీ మహేందర్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. దళితులను అవమానించేలా మధుసూదన్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆయనపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ఈటల కోళ్ల వ్యాపారంలో భాగస్వామి అయిన ఓ వ్యక్తితో చేసిన వాట్సాప్ చాట్లో దళితులను కించపరిచేలా మధుసూదన్ రెడ్డి వ్యాఖ్యలు చేశారని ధరావత్ మోహన్ ఆరోపించారు. దళితులను ఆయన అసభ్య పదజాలంతో తిట్టారని.. అందుకు ఆయన్ను తక్షణమే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.

ఈ సందర్భంగా ధరావత్ మోహన్ మాట్లాడుతూ... ఈ వివాదంపై ఈటల రాజేందర్, ఈటల బామ్మర్ది క్షమాపణ చెప్పకపోతే దళిత వాడల్లోకి వారిని అడుగుపెట్టనివ్వమని హెచ్చరించారు.తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న దళిత బంధు పథకంతో ఓడిపోతామన్న భయం ఈటల వర్గంలో మొదలైందన్నారు. అందుకే విచక్షణ కోల్పోయి మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
ఈటల జమునారెడ్డి సోదరుడు మధుసూదన్ రెడ్డి పేరిట వాట్సాప్ స్క్రీన్ షాట్స్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది. అందులో దళిత బంధు పథకానికి సంబంధించిన ప్రస్తావనలో... దళితులను కించపరిచేలా చేసిన వ్యాఖ్యలు ఉన్నాయి. దీనిపై దళిత వర్గాల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. అయితే ఈ స్క్రీన్ షాట్స్ టీఆర్ఎస్ సృష్టించినవేనని ఈటల జమునా రెడ్డి,బీజేపీ వర్గీయులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో హుజురాబాద్ పట్టణంలోని అంబేడ్కర్ విగ్రహానికి గురువారం(జులై 29) ఈటల జమున పాలాభిషేకం చేశారు. తమపై అసత్య ప్రచారాలు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను తగలబెట్టేందుకు బీజేపీ కార్యకర్తలు యత్నించారు.
అదే సమయంలో టీఆర్ఎస్ వర్గీయులు అక్కడికి చేరుకుని బీజేపీ కార్యకర్తలను అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం,తోపులాట జరిగింది. పరిస్థితులు అదుపు తప్పే అవకాశం ఉండటంతో పోలీసులు అక్కడికి చేరుకుని ఇరువురికి నచ్చజెప్పారు. టీఆర్ఎస్ కార్యకర్తలను అక్కడినుంచి పంపించేశారు. దీంతో ఉద్రిక్తతకు తెరపడింది.
హుజురాబాద్ నియోజకవర్గంలో దళిత ఓట్లు దాదాపు 45వేల పైచిలుకు ఉన్నాయి. మెజారిటీ ఓట్లు వారివే కావడంతో ఆ వర్గాన్ని తమవైపుకు తిప్పుకునేందుకు టీఆర్ఎస్,బీజేపీ ప్రయత్నిస్తున్నాయి. ఈ క్రమంలో ఇలాంటి ఘటనలు తెర పైకి రావడం చర్చనీయాంశంగా మారింది.












Click it and Unblock the Notifications